నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం

-

హైదరాబాద్‌లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే తెలుసుకునేలా సీసీ కెమెరాలన్నీ ఒకే చోట అనుసంధానం చేస్తూ నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి రానుంది. 2016లో నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ… నిధులలేమితో పనులు కొనసాగుతూ వచ్చాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని రహదారులు, భవనాలశాఖ నిధులు మంజూరు చేసింది.

ముంబయికి చెందిన నిర్మాణ సంస్థ షాపూర్ జీ-పల్లోంజి ఇంజినీర్లు రేయింబవళ్లు పనులు చేశారు. ప్రస్తుతానికి టవర్-ఏ లో పనులు పూర్తయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 16నిమిషాలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 5 టవర్లు ఏర్పాటు చేశారు. టవర్- ఏలో 20అంతస్థులు నిర్మించారు. అన్ని టవర్లలో ఇదే ఎత్తైనది. ఇందులోని 4వ అంతస్తులో DGP ఛాంబర్, 7వ అంతస్తులో CM, CS ఛాంబర్లు ఉన్నాయి. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. టవర్- ఏ పైన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. టవర్- బీని 15 అంతస్తులతో నిర్మించారు. ఇందులో పూర్తిగా పోలీసుశాఖకు సంబంధించిన సాంకేతిక విభాగాల కార్యాలయాలు ఉండనున్నాయి. డయల్ 100, షీటీమ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైం కార్యాలయాలు టవర్-బి నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి.

14 అంతస్తులో మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో పోలీసుశాఖ ప్రాశస్త్యం తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు. 15వ అంతస్తులో 360 డిగ్రీలో నగరాన్ని చూసేలా ఏర్పాట్లున్నాయి. నగరంలోని ప్రజలు 15 అంతస్తులోకి ఎక్కి నగరాన్ని వీక్షించే అవకాశం కల్పించనున్నారు. నామమాత్ర ప్రవేశ రుసుం వసూలు చేయనున్నారు. టవర్ ఏ-బీలను అనుసంధానించేలా స్కైవాక్ ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి బరువైన స్కైవాక్ ఇదేనని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

టవర్- సీలో మూడు ఫ్లోర్లు ఉన్నాయి. ఇక్కడ 480 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం ఏర్పాటు చేశారు. టవర్- డిలో రెండు ఫ్లోర్లు ఉన్నాయి. ఇక్కడ మీడియా కేంద్రంతో పాటు… ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 12 లిఫ్టులున్నాయి..టవర్- ఈ లో కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పలు శాఖలను సమన్వయం చేసుకోవడంతో పాటు సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షించడానికి… 4,5,6వ అంతస్తులలో ఛాంబర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని అన్ని సీసీ కెమెరాలతోపాటు… రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించనున్నారు.

ఏకకాలంలో లక్ష సీసీ కెమెరాలను వీక్షించేలా బాహుబలి తెరను ఏర్పాటు చేశారు. ఏదైనా ఊహించని ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి… క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు, ఇతర శాఖల అధికారులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.

పేలుళ్లు సంభవించినా… దోపిడీలు, దొంగతనాలు చేసి నిందితులు పారిపోతున్నా… ఏయే ప్రాంతాల గుండా వెళుతున్నారనే విషయాలను కమాండ్ కంట్రోల్‌లోని సీసీ కెమెరాల ద్వారా జల్లెడపడతారు. సంబంధిత పోలీసు అధికారులను అప్రమత్తం చేసి నిందితులను అదుపులోకి తీసుకునేలా ఈ కెమెరాలు ఉపయోగపడనున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news