ధన్‌ తెరాస్‌ – ధన త్రయోదశి రోజున ఐశ్వర్య సిద్ధికోసం ఏం చేయాలి?

-

దేశంలో అందరూ జరుపుకొనే అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. ఇది ఐదు రోజుల పండుగ. దీనిలో మొదటిరోజు ధన్‌తెరాస్‌. అంటే ధన త్రయోదశి. ఆశ్వీజ కృష్ణ త్రయోదశినాడు ధన్‌తెరాస్‌ను నిర్వహిస్తారు. దీని ప్రత్యేకతలు ఏమిటి, ఎందుకు జరుపుకొంటారు, దీనివల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం…

అక్టోబర్‌ 25 ధనత్రయోదశి. ఆరోజు సాయంత్రం నుంచే త్రయోదశి గడియలు ప్రారంభమవుతున్నాయి. ధనత్రయోదశి నాడు ఇంటి ముంగిళ్ళలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీ దేవి ఇంటికొస్తుంది, యముడు మీ వైపు చూడడు. ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి. ఈ పర్వదినానినే ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం లక్ష్మీ దేవిని, ధనానికి సంబంధించిన ఇతర ఉపదేవతలను ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి.

ధన త్రయోదశి ప్రత్యేకతలు ఇవే!
ధనత్రయోదశి రోజున ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్ర మథనం సమయంలో సముద్రం నుండి బయటకు వచ్చింది. అందుకే సంపద దేవుడు అయిన కుబేరుడుతో పాటు లక్ష్మీదేవిని ఈ ధనత్రయోదశి రోజును పవిత్రమైన రోజుగా పూజిస్తారు. అయితే లక్ష్మీపూజ అమావాస్య, ధనత్రయోదశి రెండు రోజుల్లోను మరింత ముఖ్యమైనదిగా భావిస్తారు. ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. ఈ శుభదినాన వెండి – బంగారం కానీ, ఒకటి రెండు కొత్త పాత్రలు కానీ కొంటే అదృష్టం వస్తుందని నమ్మకం. అలాగే వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలి చక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.

ధనత్రయోదశి నాడు ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు కాలంలో లక్ష్మీదేవీ పూజ శ్రేష్ఠం. ప్రదోషకాలంలో, అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం. అక్టోబరు 27వ తేదీ సాయంత్రం నుంచే త్రయోదశి మొదలవుతుంది. సాయంత్రం ఏడు తరువాత నుంచి స్థిర లగ్నమైన వృషభ లగ్నం. కావున ఆ రోజు ఏడు గంటల 15 నిమిషాల నుంచి 8:30 గంటల మధ్య సమయంలో ధనత్రయోదశి పూజ చేయడం విశేష ఫలప్రదమని సూచన.

ధనత్రయోదశి నాడు లక్ష్మీ దేవిని భక్తితో పూజించాలి. తీపి వంటల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున బంగారం కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తి కొలది పూజిస్తారు. వ్యాపారస్థులు, గృహస్థులు తమ ప్రాంగణాల్ని శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి. శుచిగా, శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఈ తల్లిని స్వాగతిస్తూ గుమ్మంలో అందమైన ముగ్గులు వేయాలి. దీపాలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ఇంట్లో కాలుమోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యం పిండి, పసుపుతో బుడిబుడి అడుగుల గుర్తులు వేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, రాత్రి మొత్తం దీపాలు వెలుగుతూనే ఉండాలి.

అదేవిధంగా పరిపూర్ణ ఆయువు కోసం ధనత్రయోదశి నాడు యమధర్మరాజును పూజించాలి. ఈ రోజున సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాల్ని వెలిగించాలి. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కావున ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమ దీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.

ధనత్రయోదశి రోజు ముఖ్య సమయాలు:
అక్టోబర్‌ 25 సూర్యోదయం ఉదయం 6.31 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5.49 నిమిషాలకు. ప్రదోషకాలం సాయంత్రం 5.49 నిమిషాల నుంచి 8.22 నిమిషాల వరకు.
గతేడాది అంటే 2018లో ధన్‌ తెరాస్‌ నవబర్‌ 5న వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌ 25 కాగా, వచ్చే ఏడాది అంటే 2020 లో నవంబర్‌ 13న రానున్నది. ధన్‌ తెరాస్‌ పూజను సాయంత్రం ప్రదోష కాలం నుంచి 8.17 నిమిషాల మధ్య చేస్తే చాలా మంచిది అని పండితులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news