మంగళవారం ఆంజనేయస్వామిని ఇలా పూజిస్తే కార్యజయం !

-

హనుమాన్‌.. అంటే కలియుగంలో శ్రీఘ్రంగా కోర్కెలు తీర్చే దేవుడు. ఆయన భక్త సులభుడు. చిన్నపిల్ల వాడి దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరూ ఇష్టపడే దేవుడు. హనుమంతుడు. ఆయనకు మంగళవారం, శనివారం ప్రీతికరమైనవిగా పేర్కొంటారు. దీనిలో మంగళవారం ఏ విధంగా పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తాడో పండితులు చెప్పిన వివరాలు తెలుసుకుందాం…

మంగళవారం ..అంటేనే జయవారం. జయాలకు ఇది నెలవుగా పేరుగాంచింది. మంగళవారం పూట…ఉపవాసం చేసి ఆంజనేయ ఉపాసన చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. మంగళవారానికి నవగ్రహాల్లో అంగారకుడు అధిపతి. అలాంటి అంగారకుని వల్ల ఏర్పడే ఈతిబాధలు, దోషాలు తొలగిపోవాలంటే.. ఆంజనేయ స్వామిని మంగళవారం పూట అర్చించాలి. మంగళవారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి..శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆపై ఎనిమిది రేకుల తామర పుష్పాన్ని పూజవద్ద వుంచాలి. ఎరుపు రంగుతో కూడిన ఆహార పదార్థాలను అంటే కేసరిబాత్‌ను నైవేద్యంగా సమర్పించి.. పూజను ముగించాలి. ఇంకా ఎరుపు రంగు పుష్పాలతో హనుమంతుడికి సమర్పించవచ్చు.

ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా హనుమంతుడు ప్రీతి చెందుతాడు. 9 వారాల పాటు ఇలా మంగళవారం వ్రతమాచరించి.. హనుమంతుడిని పూజించాలి. రజోగుణ సంబంధమైన మసాలా, నాన్‌వెజ్‌, ఉల్లి, వెలుల్లి, తదితర పదార్థాలను తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. వీలైతే వడమాల, పులిహోర ఎవరి శక్తి అనుసారం వారు భక్తితో హనుమంతుడికి ఆలయాల్లో అర్చన చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మంగళవారం వ్రతం ఆచరించిన వారికి వివాహ, పుత్ర దోషాలు తొలగిపోతాయి. సకల సంపదలు, భోగభాగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాలలో తమలపాకులతో మాల చేయడం, సింధూరం వేయించి తమలపాకులతో అష్టోతర పూజ చేయడం వంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారు కనీసం ౩ సార్లు భక్తితో హనుమాన్‌ చాలీసా పారాయణం చేసి దేవాలయ ప్రదక్షణలు చేస్తే హనుమంతుడు శ్రీఘ్రంగా అనుగ్రహస్తాడని పండితులు పేర్కొంటున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news