ఒక్క కొండ‌లో ఎనిమిది ఆల‌యాలు.. ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు..!

-

ఒకే కొండ‌లో ఎనిమిది ఆల‌యాలు. చుట్టూ ఎక్కడ చూసినా న‌ల్ల‌మ‌ల అడ‌వులు,  దేవుళ్ళ శిలారూపాలే కనిపిస్తుంటాయి. మ‌రి ప్ర‌సిద్ధ‌మైన ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? దాని విశేషాలు, ర‌హ‌స్యాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన శివుని ఆలయం. భైరవ కోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి.


ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహంమీద కార్తీకపౌర్ణమిరోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆ రోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాతపు సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు. ఇక్క‌డ ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖానికీ ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగానూ చెక్కబడ్డాయి. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు.

ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరుపర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వరిలింగం, భర్గేశ్వరలింగం రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.

ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. మిగిలినవన్నీ తూర్పుముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోబాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కడం విశేషం. ఇక్క‌డ దుర్గాదేవి ఆలయం కొంచెం క్రిందిభాగంలో సెలయేరు ప్రవహిస్తుంటుంది. ఈ సెలయేరు వేసవిలో కూడా ఎండిపోదు. అయితే అతిగా వర్షాలు పడినప్పుడు ఈ సెలయేరు ఎంత వేగంగా ప్రవించినప్పటికీ ఆలయములోకి ఒక చుక్క నీరు అనేది కూడా రాకపోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news