వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీ కి బెయిల్ మంజూరు చేస్తే.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. పోలీస్ కస్టడీలో విచారించిన సమయంలో కీలక సమాచారం తెలిసిందన్నారు. వంశీ ఆదేశాలతోనే సత్యవర్థన్ ను కలిసినట్టు మరో ఇద్దరూ నిందితులు విచారణలో అంగీకరించారని కోర్టుకు పీపీ తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.
మరింత సమాచారం రాబట్టేందుకు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసినట్టు కోర్టుకు వివరించారు. మరోవైపు వంశీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. సత్యవర్ధన్ కిడ్నాప్ నకు వంశీకి ఎళాంటి సంబందం లేదన్నారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసు పెట్టిందని చెప్పారు. అనారోగ్య కారణాల వల్ల వంశీకి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.