బెజవాడ మేయర్ పీఠం పై వైసీపీలో ఆసక్తికర చర్చ

-

ఏపీలో అందరి దృష్టిని ఆకర్షించింది బెజవాడ మున్సిపల్‌ కార్పొరేషన్. ఇక్కడ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో పాటు మేయర్ పదవి పై సైతం అంతే ఆసక్తి నెలకొంది. బెజవాడ పీఠాన్ని ఎట్టకేలకు అధికార వైసీపీ చేజిక్కించుకుకుంది. అయితే ఈ పదవుల పై ఆశ పెట్టుకున్న వారిని ఊసురు మనిపిస్తు ఎవరు ఊహించని వారు ఈ పదవులు తన్నుకుపోవడంతో అధికార వైసీపీలో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తుంది.

విజయవాడ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఈ పదవి పై చాలా మంది ఆశ పెట్టుకున్నారు. ఇక టీడీపీ నుంచి కూడా ఎన్నికలకు ముందే మేయర్ అభ్యర్ధిని తెర పైకి తెచ్చారు. అధికార పార్టీ మాత్రం మేయర్ విషయంలో అనేక మల్లగుల్లాలు పడింది. జనరల్ మహిళకు మేయర్ పీఠం రిజర్వ్‌ అయినా.. వైసీపీ పెద్దలు బీసీ మహిళకు పట్టం కట్టారు.

కార్పొరేటర్‌గా తొలిసారి పోటీ చేసిన భాగ్యలక్ష్మికి మేయర్‌ అనిపించుకునే భాగ్యం దక్కడంతో ఆమె వైసీపీలో హాట్ టాపిక్ గా మారారు. 2015 ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్‌గా గెలిచి ఐదేళ్లపాటు టీడీపీపై పోరాడారు మరో మహిళా నేత పుణ్యశీల. అప్పట్లో అధికార టీడీపీ ఒత్తిళ్లను ఏదుర్కొని పోరాడిన తనకు ఈ సారి గెలిస్తే మేయర్ పీఠం ఖాయం అనుకున్నారు. బెజవాడ వైసీపీ వర్గాలు కూడా అదే అనుకున్నాయి. అయితే అనూహ్యంగా ఆమెను పక్కన పెట్టడం కొత్త చర్చకు దారి తీసింది.

మరో వైపు ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతంరెడ్డి కుమార్తె లిఖితారెడ్డి కూడా మేయర్‌ రేస్‌లోకి వచ్చారు. అయితే ఆమె అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. మంత్రి వెల్లంపల్లి రాజకీయం పుణ్యశీలకు మైనస్ అయినట్లు తెలుస్తుంది. ఇక మహిళను మేయర్‌ చేయడంతో డిప్యూటీ మేయర్‌ అవుదామని చాలా మంది పురుష నేతలు లాబీయింగ్‌ చేశారట. కానీ మాజీ డిప్యూటీ మేయర్‌ ఆళ్ల చెల్లారావు కుమార్తె దుర్గను డిప్యూటీ మేయర్‌ను చేశారు వైసీపీ పెద్దలు.

ఇక టీడీపీ నుంచి మేయర్ అభ్యర్దిగా బరిలో దిగిన ఎంపీ కేశినేని కూతురు శ్వేత చివరకు కార్పోరేటర్ పదవికే పరిమితమయ్యారు. అనూహ్యంగా చర్చలో లేని కొత్త వారు బెజవాడ కార్పోరేషన్ లో మేయర్,డిప్యూటీ మేయర్ పదవులు చేజిక్కుంచుకున్నారు. దీంతో అన్ని తమవైపు ఉన్న కూసింత లక్కు కూడా తమ వైపు ఉండాలంటూ పదవులు అధిరోహించిన మహిళామనుల పై చర్చించుకుంటున్నాయి అధికార వైసీపీ వర్గాలు.

Read more RELATED
Recommended to you

Latest news