ఎన్టీఆర్‌ విషయంలో రెండు సార్లు పొరపాటు చేసిన బాలీవుడ్ బ్యూటీ.. ఏమైందంటే?

-

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్‌ గురించి ట్వీట్‌ చేసి ఓ బాలీవుడ్‌ బ్యూటీ సోషల్‌మీడియాలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్‌ని ట్యాగ్‌ చేయడానికి బదులు వేరే నెటిజన్‌ ఖాతాను ఆమె జత చేస్తూ ఈ ట్వీట్‌ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు ఎన్టీఆర్‌ ఖాతా అది కాదని.. సరి చూసుకోవాలని వరుస పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరంటే..?.

అమీషా పటేల్

‘నరసింహుడు’ కోసం తారక్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు బాలీవుడ్‌ బ్యూటీ అమీషా పటేల్‌. మాస్‌, భావోద్వేగభరితమైన కథాంశంతో సిద్ధమైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా తర్వాత కెరీర్‌పరంగా ఎన్టీఆర్‌ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సక్సెస్‌పై హర్షం వ్యక్తం చేస్తూ తాజాగా అమీషా ఓ ట్వీట్‌ పెట్టారు.

‘‘ఎన్టీఆర్‌తో కలిసి నేను నటించిన తెలుగు సినిమాలోని ఫొటో ఇది. తెలుగు సూపర్‌స్టార్‌గా పేరు పొందిన ఆయన ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. లవ్లీ కోస్టార్‌. కష్టపడే గుణం, నిజాయతీ కలిగిన వ్యక్తి’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. అయితే, ఈ ట్వీట్‌ని ఎన్టీఆర్‌ ట్విటర్‌ ఖాతా @tarak9999కు ట్యాగ్‌ చేయడానికి బదులు @jrntr పేజీకి జత చేశారు. దీన్ని గమనించిన పలువురు నెటిజన్లు.. ‘‘మేడమ్‌ తారక్‌ అన్న ట్విటర్‌ ఖాతా వేరు.. ఒక్కసారి మీరు సరి చూసుకోండి’’ అని రిప్లైలు ఇచ్చారు. నెటిజన్లు పెట్టిన కామెంట్స్‌ చూసిన అమీషా మరోసారి అదే సందేశాన్ని ట్వీట్‌ చేస్తూ.. మళ్లీ అదే ఖాతాను ట్యాగ్‌ చేశారు. అలా, ట్యాగింగ్‌లో రెండు సార్లు తప్పులు దొర్లడంతో చేసేది లేక.. మూడోసారి కేవలం ఎన్టీఆర్‌ పేరుని మాత్రమే ఉంచి, ట్యాగింగ్‌ లేకుండా జాగ్రత్త పడ్డారామె.

Read more RELATED
Recommended to you

Exit mobile version