Tragedy : కత్తి గాయం నుంచి కోలుకున్నా.. కోతి రూపంలో తలుపుతట్టిన మృత్యువు

-

ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న తమ కుమారుడు ఓసారి మృత్యువు ఒడిదాకా వెళ్లి తిరిగి వచ్చాడు. కొడుకు ప్రాణాలతో దక్కాడన్న ఆ తల్లిదండ్రుల ఆనందం కొన్నిరోజులు కూడా నిలవలేదు. మరో ప్రమాదం ఆ బాలుడి ప్రాణాలు తీసుకుపోయింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరులో చోటుచేసుకుంది.


కట్కూర్​ సర్పంచ్ జిల్లెల అశోక్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన దేవునూరి శ్రీకాంత్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు. వారింట్లో ఉన్న కిచెన్​కు మరో రెండు గదులకు మధ్య కాస్త గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్​ నుంచే వెలుతురు, గాలి వస్తుంది. ఆ ఖాళీ ప్రదేశంలో శ్రీకాంత్.. తడక ఏర్పాటు చేసి గాలికి ఎగిరిపోకుండా బండరాళ్లు పెట్టాడు.

సోమవారం రోజున ఆ తడక పైనుంచి కోతులు ఇంట్లోకి చొరబడ్డాయి. వంటింట్లోనే ఉన్న రజిత వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించింది. ఆమె వెంటే చిన్న కుమారుడు అభినవ్ ఉన్నాడు. బెదిరిపోయిన కోతులు వచ్చిన మార్గం నుంచే వెళ్లేందుకు ప్రయత్నించగా పైన ఉన్న రాయి కాస్త అభినవ్​పై పడి అతడి తలపగిలి అక్కడికక్కడే మరణించాడు.

నెలక్రితమే అభినవ్ ఇంట్లో గడప దాటుతున్నప్పుడు కింద పడ్డాడు. ఆ సమయంలో నేలపై ఉన్న కత్తి తగిలి గొంతు తెగింది. ఆస్పత్రిలో చికిత్స చేయించగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతలోనే కోతుల వల్ల ప్రాణాలు కోల్పోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version