మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న చంపేస్తామని ఐసిస్ కాశ్మీర్ పేరుతో బెదిరింపు ఈమెయిళ్లను పంపారు. అయితే ఈ ఘటనపై నిన్న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదిలా ఉంటే ఫిర్యాదు అనంతరం కూడా మరో బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ లో గంభీర్ ఇంటి వీడియోను కూడా పంపినట్లు తెలిసింది. ‘నిన్ను చంపాలనుకున్నాం. నిన్న బతికిపోయావ్. బతుకుమీద ఆశ ఉంటే రాజకీయాలను, కశ్మీర్ అంశాన్ని వదిలెయ్’ అని మెయిల్లో బెదిరించారు. దీంతో ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
అయితే ఈ ఈమెయిళ్లపై విచారణ ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు బెదిరింపు మెయిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయో కనిపెట్టారు. అయితే ఇందులో ఒకటి ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి రాగా, మరొకటి పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కరాచీలోని సింధ్ యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసుల ద్వారా తెలిసింది. షాహీద్ హమీద్ అనే యువకుడు.. గంభీర్కు మెయిల్ పంపినట్లు పేర్కొన్నారు.