జాతినే అవమానిస్తావా… అంబటిపై కాపు నేతల ఆగ్రహం

-

విజయవాడ: ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై కాపు సామాజిక వర్గం నేతలు మండిపడుతున్నారు. అంబటిరాంబాబు ఇటీవల కాలంలో ఓ యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ ‘’కాపులు.. తెలివితక్కువవాళ్లు, ఆవేశపరులు, మాంసం ఎక్కువగా తింటారు, మద్యం బాగా తాగుతారు. ఇవన్నీ మిగతా కమ్యూనిటీల్లో ఉన్నా.. కాపుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి’’అని అన్నారు.

దీంతో అంబటి పై కాపు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పి, కాపులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాపు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కాపు ద్రోహి అంబటి రాంబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాపు యూత్ ఫోర్స్ సభ్యుడు శివశంకర రావు మాట్లాడుతూ కాపు కులాన్ని అవమానించేలా అంబటి మాట్లాడారని మండిపడ్డారు. మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసిన అంబటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాపుల ఓట్లతో గెలిచి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాపు కులంలో పుట్టి… జాతినే అవమానిస్తావా అని ప్రశ్నించారు.

మరో సభ్యుడు ఆకాశ్ మాట్లాడుతూ కాపుల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న వాళ్లు లేరా అని ప్రశ్నించారు. అంబటికి కాపు సంక్షేమం కోసం మాట్లాడటం చేతకాదని ఎద్దేవా చేశారు. సిగ్గు లేకుండా తిట్టడానికి ముందుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పకపోతే అంబటిని అడ్డుకుని తీరుతామన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను విమర్శించే అర్హత అంబటీ నీకుందా అని ప్రశ్నించారు. తీరు మార్చుకోక పోతే… కాపులే తరిమి కొడతారని ఆకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version