విజయనగరం: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కలిసి జీవించాలనుకున్నారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. ఆనందంగా జీవించాలనుకున్నారు. అయితే వారి ఆశలకు పెద్దలు కల్లెం వేశారు. వారి ప్రేమను నిరాకరించారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ససేమీరా అన్నారు. దీంతో కలిసి జీవించలేమని ప్రేమకులు అనుకున్నారు. కనీసం చావులోనైనా ఒక్కటిగా ఉండాలనుకున్నారు. చివరకు ఒక్కటిగా తనువు చాలించారు.
ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. బొబ్బిలికి చెందిన రాకేశ్, మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. రెండ్రోజుల క్రితం ఈ యువతీ, యువకుడు నాగావళి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరికొకరు చున్నీకట్టుకుని నదిలో దూకారు. నదిలో దూకిన ప్రేమ జంట మృతదేహాలు లభ్యమయ్యాయి.