భలే దొంగలు.. దోచుకునేందుకు వెళ్లి.. తిరిగి వాళ్లే రూ.100 ఇచ్చి…

-

దేశ రాజధాని దిల్లీలో ఓ విచిత్రమైన దోపిడీ జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ జంటను దోచుకునే ఆలోచనతో బైక్​పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ జంటను అడ్డగించారు. మద్యం మత్తులో తూగుతూ తుపాకీతో బెదిరించి వారిద్దరినీ తనిఖీ చేశారు. ఆ జంట వద్ద కేవలం రూ.20 మాత్రమే ఉండటం చూసి నిరాశ చెందారు. మహిళ ఒంటిపై ఉన్న నగలు రోల్డ్ గోల్డ్ అని గమనించారు. వాళ్ల పరిస్థితి చూసి మనసు కరిగిందో ఏమో.. ఆ జంట చేతిలో రూ.100 పెట్టి అక్కడినుంచి బైక్​పై వెళ్లిపోయారు. బుధవారం అర్ధరాత్రి వేళ ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 200కు పైగా సీసీటీవీ ఫుటేజీలను గమనించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, ద్విచక్ర వాహనం, 30 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు జీఎస్టీ అకౌంటెంట్‌ కాగా.. మరొకరు ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగిగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version