నైరుతి రుతుపవనాలు ఇవాళ (మే 30వ తేదీ) కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేస్తోంది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరోవైపు రెమాల్ తుపాను తర్వాత భానుడు ఉగ్రరూపం దాల్చడంతో రెండు రోజులుగా రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. విశాఖలో బుధవారం ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటడంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో అక్కడి ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఒంగోలులో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.