పంచాయతీ ఫలితాలు ఆమాజీ మంత్రిని డిఫెన్స్ లో పడేశాయా

-

అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీలో పంచాయతీ పోరు అసెంబ్లీ ఎన్నికల మాదిరి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికలు చివరి దశకి వచ్చేసరికి కొందరు మంత్రులు.. మరికొందరు మాజీ మంత్రుల నియోజకవర్గాలపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. నిత్యం ప్రభుత్వం పై ఒంటి కాలి పై లేచే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేతకు పంచాయతీ ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయట..ఇంట బయట ఈ ఫలితాల పైనే చర్చ జరుగుతుండటంతో మాజీ మంత్రి కాస్త డిఫెన్సులో పడ్డారట…

రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం పతనం ప్రారంభమైందని నిత్యం నిరసన గళం వినిపించే దేవినేనికి.. ఇంట్లో ఫలితాలు మాత్రం మింగుడు పడడం లేదట.ఇదంతా అధికారపక్ష ఆర్థిక విజయం అని ఆయన సర్ది చెప్పుకొంటున్నా ఫలితాలు మాత్రం తీవ్ర నిరాశలోకి నెట్టాయట. పంచాయతీ ఎన్నికల్లో మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గం మైలవరం కూడా ఉంది. మైలవరంలో 48 పంచాయతీలలో ఎన్నికలు జరిగా 44 చోట్ల వైసీపీ విజయం సాధించిందట..కేవలం మూడుచోట్ల మాత్రమే టీడీపీ మరో పంచాయతీని ఇతరులు దక్కించుకున్నారు.

దేవినేని సొంత నియోజకవర్గం ఫలితాల పై ఇప్పుడు ఇంటా బయటా చర్చ మొదలైంది. అధికార పక్షంలోని ముఖ్యనేతలు సైతం ఇవిగో దేవినేని నియోజకవర్గంలోని ఎన్నికల ఫలితాలు అని పదేపదే గుర్తు చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే పట్టుమని 10 పంచాయతీలు గెలిపించుకోలేని నాయకుడు.. నిత్యం బయట రచ్చ చేస్తారు అని సెటైర్లు వేస్తున్నారట. ఈ ఫలితాలపై దేవినేని సైతం కలత చెందారని తెలుస్తోంది.

అధికారపక్షంతో పాటు.. సొంత పక్షంలోని నాయకులు చేస్తోన్న విమర్శలపై ఇప్పటికే కౌంటర్ మొదలు పెట్టింది దేవినేని వర్గం. మైలవరం విషయంలో ప్రభుత్వ పెద్దలు స్వయంగా మానిటర్ చేశారని ఆర్థిక వనరులు పుష్కలంగా ఇచ్చి ఎన్నికలు నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉమా అనుచరులని ఓడించడానికే అన్ని సమకూర్చారు అని ఆయన వర్గం చెబుతోంది. నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ చాలా సీరియస్‌గా తీసుకుని పని చేశారన్నది వైసీపీ నేతలు చెప్పేమాట.

మంత్రి కొడాలి నానిపై సవాల్ అంటూ కొద్దిరోజుల క్రితం గొల్లపూడిలో హల్‌చల్ చేసిన దేవినేనికి ఈ ఫలితాలు పెద్ద దెబ్బగా విశ్లేషిస్తున్నారు ఇంకొందరు. చంద్రబాబుతో భోగిమంటలు వేయించి పెద్ద ప్రోగ్రాం చేసినా పరిటాల లాంటి చోటే టీడీపీ ఓడిపోయిందని.. తమ నేత ఓటమి లెక్కేంటని ఉమా వర్గం నేతలు వాదిస్తున్నారు. మైలవరంలో అధికార పార్టీకి దీటుగా ఆర్థిక వెసులుబాటు లేకనే తాము ఓడిపోయామని చెబుతున్నారట. ఫలితాల రోజున ప్రాణాలొడ్డి గెలిచామని ఈ మాజీ మంత్రి కేంద్ర పార్టీ కార్యాలయంలో చేసిన ప్రకటనను జోడించి మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా పంచాయతీ ఫలితాలు దేవినేనిని డిఫెన్స్‌లో పడేశాయనే కామెంట్స్‌ జోరందుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news