కేసీఆర్‌ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు ఉండగానే వ్యూహాలు రచిస్తోంది. మొన్నటిదాక లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసిన పార్టీ.. వచ్చే నెలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా భేటీలు నిర్వహించనుంది.

మరోవైపు రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై భేటీలో చర్చించనున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో పార్టీ అనుసరించబోయే వైఖరి కీలకం కానుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ విధానం, సమావేశాల్లో లేవనెత్తానాల్సిన అంశాలపై ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version