ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా, దాని ప్రభావం నేరుగా మన జేబులపై పడుతోంది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో సాగుతున్న యుద్ధ వాతావరణం ఇప్పుడు మన ఆరోగ్య ఖర్చులను పెంచేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రోగులు వాడే మందుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని భారత ఫార్మా రంగానికి చెందిన పెద్ద కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి, మన మెడిసిన్ రేట్లకు ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం..
రవాణా ఖర్చులు పెరిగాయి: యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో ప్రయాణించే సరుకు రవాణా నౌకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక కంటైనర్ల కొరత, భద్రతా కారణాల వల్ల ఓడలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి.
ముడి పదార్థాల కొరత: మనం వాడే చాలా రకాల మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ – API) ఇతర దేశాల నుండి దిగుమతి అవుతాయి. ఇక అంతర్జాతీయంగా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో, ఈ ముడి పదార్థాల ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి.

కంపెనీలపై పడుతున్న భారం: ప్రస్తుతానికి రోగులకు మందుల కొరత రాకుండా చూసేందుకు, ఈ పెరిగిన అదనపు ఖర్చులన్నింటినీ ఫార్మా కంపెనీలే భరిస్తున్నాయి. ఇక దీనివల్ల ఆయా కంపెనీల బ్యాలెన్స్ షీట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే, ఈ పరిస్థితి ఇలాగే మరికొన్నాళ్లు కొనసాగితే, ఆ భారాన్ని ప్రజలపై వేయక తప్పదని నిపుణులు అంటున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే, సామాన్యుడికి వైద్యం మరింత భారం కానుంది. నిత్యావసర మందుల ధరలు పెరిగితే మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతుంది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
