భాగవత, గరుడ పురాణాల ప్రకారం మానవ జన్మ ఎంతో విశిష్టమైనది. జీవుడు మాతృగర్భంలో ప్రవేశించిన క్షణం నుంచి ప్రసవం వరకు పొందే అనుభవాలు, పడే యాతనల గురించి పురాణాల్లో అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా గర్భంలో ఏడవ నెల వచ్చేసరికి శిశువుకు సంపూర్ణ స్పృహతో పాటు పూర్వజన్మ జ్ఞానం కలుగుతుందట. ఆ సమయంలో తాను పడుతున్న నరకయాతనను తలచుకుంటూ, ఈ మాయ నుంచి కాపాడమని జీవుడు భగవంతుడిని దీనంగా వేడుకుంటాడు. ఆ దివ్యమైన ప్రార్థన, గర్భంలో శిశువు పొందే పరిణామక్రమం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మాతృగర్భంలో శిశువు పరిణామక్రమం: జీవుడు శేష దుఃఖంతోనే గర్భంలో ప్రవేశిస్తాడు. ఫలదీకరణం తర్వాత మొదటి రోజుకు ఖలిలమై, ఐదో రోజుకు బుడగలా, పదో రోజుకు మాంసపు ముద్దగా మారుతుంది.
1 నుండి 3 నెలలు: తల, చేతులు, కాళ్లు, గోళ్లు, చర్మం, నవరంధ్రాలు ఏర్పడతాయి.
4 నుండి 6 నెలలు: సప్త ధాతువులు, ఆకలి దప్పులు ఉద్భవించి, మావిచే కప్పబడిన శిశువు గర్భంలో తిరుగుతుంటాడు.

ఈ సమయంలో తల్లి తీసుకునే ఆహార పానీయాల తీవ్రత, కడుపులోని దుర్గంధం మరియు క్రిముల వల్ల శిశువు తట్టుకోలేక మాటిమాటికి మూర్ఛపోతూ నరకానుభవాన్ని పొందుతాడు.
పూర్వజన్మ జ్ఞానం & భగవంతుడికి ప్రార్థన: పంజరంలో బంధించిన పక్షిలా తల్లకిందులుగా ఉన్న శిశువుకు భగవంతుని దయతో పూర్వజన్మ స్మృతులు గుర్తుకొస్తాయి. గర్భంలో ఏడో నెల రాగానే జీవుడు భగవంతుడితో బాధ స్వరంతో మొరపెట్టుకుంటాడు.
శిశువు ప్రార్థన: “ఓ శ్రీహరీ… నా గత జన్మలో నీ మాయలో పడి భార్యాబిడ్డలు, అహంకారం, ధన సంపాదన ధ్యేయంగా జీవించి ఎన్నో పాపాలు చేశాను. నేను సంపాదించిన ఆస్తులను నా కుటుంబం అనుభవిస్తే, ఆ పాపాలను మాత్రం నేను మూటగట్టుకున్నాను. ఈ మలమూత్ర కూపంలో, జఠరాగ్ని వేడిలో నేను ఇక ఉండలేను. నన్ను ఈ గర్భం నుంచి బయటకు పంపు. ఈసారి ఏ పాపాలూ చేయకుండా, సంసార బంధాల్లో చిక్కుకోకుండా నిరంతరం నీ చరణారవిందాలనే ధ్యానిస్తూ ముక్తి పొందడానికి ప్రయత్నిస్తాను.”
ఇక మాతృ గర్భంలో ఉన్నప్పుడు దుర్గంధాన్ని భరించలేక “ఈసారి జన్మలో నిన్ను మర్చిపోను, పాపాలు చేయను” అని భగవంతుడికి ఇచ్చిన మాటను ఈ భూమిపైకి వచ్చాక మాయలో పడి మనం నిలబెట్టుకుంటున్నామా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
గమనిక: ఈ కథనం శ్రీమద్భాగవత పురాణము మరియు గరుడ పురాణములోని సంప్రదాయ గ్రంథాల వివరణల ఆధారంగా అందించబడింది
