వరలక్ష్మీ వ్రతం శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శుభకరంగా భావిస్తారు. సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఈ రోజు అమ్మవారిని పూజించి ముత్తైదువులకు వాయనాలు ఇస్తారు. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా లక్ష్మీదేవే మన ఇంటికి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు గవ్వలు: వరలక్ష్మీ వ్రతం రోజున పసుపు గవ్వలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం చాలా శ్రేష్ఠం. గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇవి చాలా తక్కువ ధరలోనే లభిస్తాయి. ఇక వీటిని పూజలో ఉంచి పూజించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు తాండవిస్తాయి.
దక్షిణామూర్తి శంఖం: శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. అందుకే వరలక్ష్మీ వ్రతం రోజున దక్షిణామూర్తి శంఖాన్ని కొనుగోలు చేసి తెచ్చుకోవడం వల్ల కనకవర్షం కురుస్తుందని నమ్ముతారు. ఇక ప్రతిరోజూ ఇంట్లో శంఖాన్ని ఊదడం వల్ల ధనాకర్షణ కలగడమే కాకుండా, ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

చిన్న కొబ్బరికాయ (శ్రీఫలం): అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ‘శ్రీఫలం’ అని పిలిచే చిన్న కొబ్బరికాయలు ఒకటి. ఇక వ్రతం రోజున ఈ చిన్న కొబ్బరికాయను ఇంటికి తెచ్చి పూజలో ఉంచితే లక్ష్మీకటాక్షం లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
పసుపు, కుంకుమ మరియు పూలు: వీటితో పాటు పూజకు కావలసిన పసుపు, కుంకుమ, తాజా పూలు, పండ్లను తెచ్చుకొని భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇవి ఇంట్లో మంగళకరమైన వాతావరణాన్ని నింపుతాయి.
వరలక్ష్మీ వ్రతం రోజున భక్తిశ్రద్ధలతో పూజ చేయడంతో పాటు అమ్మవారికి ఇష్టమైన ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, కుటుంబంలో ఎల్లప్పుడూ సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
గమనిక: ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకాలు మరియు పండితుల సూచనల ఆధారంగా అందించిన సమాచారం మాత్రమే. మీ ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించి శుభ ఫలితాలను పొందవచ్చు.
