విద్యార్థులకు గుడ్​న్యూస్.. నీట్‌ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ గడువు పెంపు

-

ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు కేంద్ర సర్కార్ గుడ్​న్యూస్ చెప్పింది. నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌(ఏడాది కాలం) కటాఫ్‌ తేదీని ఆగస్టు 11 వరకు కేంద్రం పొడిగించింది. పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో నీట్‌ పీజీ-2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించినట్లైంది.

ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యేవారే నీట్‌ పీజీ-2023 పరీక్షకు అర్హులని కేంద్రం తొలుత పేర్కొంది. ఆ కటాఫ్‌ గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తూ గత నెల 13న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే కొవిడ్‌ మహమ్మారి కారణంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌ గతేడాది ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్‌ 30 లోపు అది పూర్తవ్వదు. ఫలితంగా చాలామంది విద్యార్థులు నీట్‌ పీజీ పరీక్ష రాసేందుకు అనర్హులుగా మారే ముప్పు ఏర్పడింది.

తాజా నిర్ణయంతో తెలంగాణలోని దాదాపు 4 వేలమంది విద్యార్థులు సహా పలు రాష్ట్రాల అభ్యర్థులందరికీ ఉపశమనం లభించినట్లయింది. వీరంతా గురువారం నుంచి ఆదివారం (ఈ నెల 12) వరకు నీట్‌ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మార్చి 5న జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version