జామకాయలు అంటే ఇష్టపడని వారుండరు. పల్లెల్లో అయితే జామచెట్టులేని ఇల్లుండదు. జామ కాయల్లో విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నందున ఇది పోషకాహారం కూడా. జామ శారీరక మానసిక ఆరోగ్యాలకు మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలకు నెలసరిలో నొప్పి, ఎన్టీడీ లాంటి సమస్యలున్న మహిళలకు జామ చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే జామ తీయగా ఉండటం వల్ల దీన్ని షుగర్ పేషెంట్స్ తినొచ్చా లేదా అన్న ప్రశ్న అందరిలో మెదులుతుంది. దీనిపై వైద్యులు ఏమన్నారంటే..?
డయాబెటిస్ ఉన్నవారు చాలా పండ్లు తినకూడదు. కానీ జామ మినహాయింపు. పైగా రక్తంలో షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. హృద్రోగాలను అరికడుతుంది. ఇందులోని బి-3, బి-6 రక్తాన్ని సాఫీగా సరఫరా చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది సౌందర్య సాధనం కూడా. దీంతో చర్మం మృదువుగా ఉంటుంది. ముఖంలో నునుపు, మెరుపు సంతరించుకుంటాయి.
జామకాయలో విటమిన్లు, సోడియం, పొటాషియం, ప్రొటీన్లు ఉన్నందున ఇది మంచి పోషకాహారం. నెలసరిలో వచ్చే నొప్పి, ఇబ్బందులకు జామ దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇవి తినడం వల్ల గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ (ఎన్టిడి) సమస్య ఉన్న స్త్రీలలో గర్భస్రావం, శిశు మరణాల్లాంటివి సాధారణం. జామకాయలు ఆ సమస్యను చాలా వరకూ నివారిస్తాయని అధ్యయనాల్లో తేలింది.
పీచు పుష్కలంగా ఉంటుంది కనుక జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది. మరీ పండిపోకుండా దోరగా ఉన్న వాటిని తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే అమ్మాయిలు ఈ పండ్లు రోజుకొకటి తింటే చాలు సత్వర ఫలితం ఉంటుంది. జామకాయలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. తరచూ తిన్నట్లయితే ఆ మహమ్మారికి దూరంగా ఉన్నట్లే. వీటిలో ఉన్న సి విటమిన్ నోటిపూతను రానివ్వదు.
జామలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కళ్లకు మేలు చేస్తుంది. చయాపచయ క్రియ (మెటబాలిజం)ను క్రమబద్ధం చేస్తుంది. తీపి పెద్దగా ఇష్టపడని వాళ్లు ఉప్పూకారం లేదా మిరియాల పొడి అద్దుకుని తినొచ్చు. పండిన కాయలతో హల్వా, సాస్.. పచ్చివాటితో కూర, పచ్చడి చేసేవారున్నారు.