ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోమారు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆప్ఘన్ లో ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత నుంచి వరసగా ఎక్కడో ఒక చోట పేలుళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మరోసారి బాంబు పేలుళ్లు, తుఫాకీ ఫైరింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కాబూల్ లోని సర్ధార్ మహ్మద్ దౌద్ ఖాన్ సైనిక ఆసుపత్రికి సమీపలంలో రెండు వరస బాంబు పేలుళ్లు, గన్ ఫైరింగ్ శబ్ధం వినిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ ఘటనలో 19 మంది మరణించగా.. 50 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై ఇటు తాలిబన్ల నుంచి కానీ, బాధ్యులైన వారి నుంచి కానీ ఎటువంటి సమాచారం రాలేదు.
కాగా ఆఫ్ఘన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన నుంచి ఐసిస్-కే రెచ్చిపోతోంది. వరసగా దాడులు చేస్తూ తాలిబన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతంలో మసీదులో ప్రార్థనలు జరగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి చేసి వందల సంఖ్యలో ప్రజల్ని పొట్టనపెట్టుకుంది. అంతకుముందు కాబూల్ విమానాశ్రయం నుంచి ప్రజలను తరలిస్తున్న సందర్భంలో కూడా బాంబు దాడులు చేసి అమెరికన్ సైనికులతో పాటు, ప్రజలను చంపింది. ఆతర్వాత అమెరికా ఐసిస్-కే సూత్రధారులపై డ్రోన్ దాడులు చేసి వారిని హతమార్చి పగ తీర్చుకుంది.