ఎన్నికలు వస్తే చాలు కాంగ్రెస్ వాళ్లు కొత్త బట్టలు వేసుకుని రెడీ అవుతారు : అమిత్‌ షా

-

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ… కేసీఆర్ గత పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తూ, రాష్ట్రంలోని దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పేదల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. “కేసీఆర్… గిరిజనుల కోసం అనేక హామీలు ఇచ్చారా? వాటిలో ఒక్కటైనా అమలు చేశారా? ఆదివాసీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న హామీ ఏమైంది? దళితబంధును కొందరికి మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది చంద్రశేఖర్ రావూ జీ?” అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.

తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేశానని కేసీఆర్ చెబుతుంటారని, కానీ రైతుల ఆత్మహత్యలు, అవినీతి విషయంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేశారని అమిత్ షా ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చే సమయం ఆసన్నమైందని, డిసెంబరు 3న హైదరాబాదులో బీజేపీ జెండా రెపరెపలాడాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనుల కోసం ప్రధాని మోదీ తొమ్మిదేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఒడిశాకు చెందిన నిరుపేద గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు.

ఈ సందర్భంగా అమిత్ షా కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికలు వస్తే చాలు కాంగ్రెస్ వాళ్లు కొత్త బట్టలు వేసుకుని తయారవుతారని వ్యంగ్యం ప్రదర్శించారు. పేదల గురించి మాట్లాడే కాంగ్రెస్ గతంలో వారి కోసం ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version