సీఎం సీట్లో ఎవరు కూర్చున్నా.. అభ్యంతరం లేదు : భట్టి

-

ఇటీవల అమెరికాలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సీఎం సీటుపై చేసిన వ్యాఖ్యలతో టీకాంగ్రెస్‌ రాజకీయం ఇప్పుడంతా దానిచుట్టే సాగుతోంది. అయితే.. సీఎం సీట్లో ఎవరు కూర్చున్నా.. అభ్యంతరం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​పవర్‌లోకి రావడమే ఎజెండా అని స్పష్టం చేశారు. సమిష్టి కృషితో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. ఆ తర్వాత హై కమాండ్ సీఎంను నిర్ణయిస్తుందన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్​పేటెంట్ అని, వైఎస్సార్​పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే హామీ ఇచ్చామన్నారు. ధరణి దుర్మార్గమైన విధానమన్నారు. ఇక భగీరథ ఉత్త ఫ్రాడ్ అన్నారు. పేదల సంక్షేమాన్ని బీఆర్ఎస్​మరిచిపోయిందన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా పార్టీ హామీలన్నీ మరిచిపోయిందన్నారు.

అందుకే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తే.. సంపదను పేదలకు పంచుతామన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్స్, దేశంలో క్యాప్టలిస్టులు కలిసి తెలంగాణను ఇబ్బంది పెడుతున్నారన్నారు. వాళ్ల ఆగడాలకు చెక్​పెట్టాలంటే పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ప్రజల అవసరాలే తమ ఎజెండా అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నారు. సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయన్నారు. తొమ్మిది ఎండ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారన్నారు. తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దోచేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version