కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వరి MSP పెంపు

-

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. జూన్ నుండి ప్రారంభం కాబోయే వానకాలం (ఖరీఫ్) సీజన్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో 14 రకాల పంటల ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ముఖ్యంగా దేశంలో ఎక్కువగా పండించే వరి ధాన్యం ధరను పెంచడం గమనార్హం. ఆ కొత్త ధరల వివరాలేంటో సింపుల్‌గా చూసేద్దాం.

వరి ధాన్యం ధర ఎంత పెరిగిందంటే?: రైతులకు ఊరటనిస్తూ ఈసారి వరి ధాన్యం ధరను క్వింటాల్‌కు అదనంగా రూ.72 పెంచినట్లు ప్రకటించారు. ఇక దీనివల్ల వచ్చే సీజన్‌లో సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,441 చొప్పున రైతులకు లభించనుంది. అలాగే, నాణ్యమైన ఏ-గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్ ధరకు రూ.2,461 గా కేంద్రం నిర్ణయించింది.

పత్తి, వేరుశనగ రైతులకు భారీ లాభం: పత్తి పండించే రైతులకు కూడా కేంద్రం మంచి ఊరటనిచ్చింది. మీడియం రకం పత్తిపై ఏకంగా రూ.557 పెంచి, క్వింటాల్ ధరణి రూ.8,267 గా ఫిక్స్ చేసింది. మరో రకం పత్తి ధరను రూ.8,667 గా నిర్ణయించారు. ఇక వేరుశనగ క్వింటాల్ ధరను కూడా పెంచడంతో ఇప్పుడు దాని ధర రూ.7,517 కు చేరింది.

Big Relief for Farmers: Central Cabinet Hikes Paddy MSP
Big Relief for Farmers: Central Cabinet Hikes Paddy MSP

పొద్దుతిరుగుడు, నువ్వుల ధరలకు రెక్కలు: ఈసారి అన్నిటికంటే అత్యధికంగా పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) గింజల ధరను భారీగా పెంచారు.ఇక క్వింటాల్‌కు ఏకంగా రూ.622 పెంచడంతో దీని ధర రూ.8,343 కి చేరింది. అలాగే నువ్వుల ధరను రూ.500 పెంచి రూ.10,346 గా, గడ్డి నువ్వుల ధరను రూ.515 పెంచి రూ.10,052 గా ప్రకటించారు.

మొక్కజొన్న ధర మాత్రం ఇంతే: మిగతా పంటలతో పోలిస్తే మక్కజొన్న (మొక్కజొన్న) రైతులకు మాత్రం కొంచెం నిరాశే ఎదురైందని చెప్పాలి. దీని మద్దతు ధరను కేవలం రూ.10 మాత్రమే పెంచారు. దీంతో వచ్చే వానకాలం సీజన్‌లో మక్కజొన్న క్వింటాల్ ధర రూ.2,410 గా ఉండబోతోంది.

రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో కేంద్రం ఈ ధరలను ప్రకటించడం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో.. కేంద్రం ప్రకటించిన ఈ కొత్త మద్దతు ధరలు (MSP) రైతన్నలకు ఆర్థికంగా ఎంతోకొంత అండగా నిలుస్తాయని ఆశించవచ్చు.

గమనిక: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కనీస మద్దతు ధరలు రాబోయే వానకాలం (ఖరీఫ్) సీజన్ పంటల కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news