కరోనాపై కేసీఆర్ కీలక నిర్ణయం… మూడు రోజులు హెలికాప్టర్ పర్యటనలు !

-

తెలంగాణలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితుల పై ప్రగతిభవన్ లో ఇవాళ ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.   కరోనాను గుర్తించి ముందస్తు కట్టడి చేసి, ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన జ్వర సర్వేను మరోసారి రాష్ట్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాలని సిఎం కెసిఆర్  వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.  సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదనీ, ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి చెందిన సరిహద్దు జిల్లాల్లో కరోనా ప్రభావం పూర్తిగా సమసి పోలేదన్నారు. అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ శాస్త్రీయ అధ్యయనం చేసి, కరోనా విస్తరణకు గల కారణాలను క్రిటికల్ అనాలిసిస్’ చేయాలన్నారు. అందుకు సంబంధించి శాస్త్రీయ పద్దతుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల వైద్య బృందం ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో పర్యటించి రావాలన్నారు. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరి ఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు, హెలికాప్టర్ ద్వారా వరుస పర్యటనలను చేపట్టాలని సీఎం ఆదేశించారు. పర్యటన అనంతరం నివేదికను సిద్ధం చేసి కేబినెట్ కు సమర్పించాలన్నారు.

జిల్లాల్లో కరోనా విస్తరించడానికి గల ప్రధాన కారణాలను క్రేత్రస్థాయిలో అధ్యయనం చేసి పర్యటన సందర్భంగా విశ్లేషించాలన్నారు. కరోనా నియంత్రణకోసం చేపట్టాల్సిన చర్యలను, ముందస్తు నివారణ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించాలన్నారు. ఇందుకుగాను స్థానిక జిల్లా కలెక్టర్లను, డిపివోలు, మున్సిపల్ కమీషనర్, డిఎంహెచ్ ఓ దవాఖానా సూపరిండెంట్ లతో సహా సంబంధిత స్థానిక అధికారులను సమావేశ పరిచి అప్రమత్తం చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version