తండ్రిని మించిన త‌న‌యుడు కాలేక పోతున్న మంత్రిగారు.. వైసీపీలో చ‌ర్చ‌…!

-

నెల్లూరు జిల్లాకు చెందిన కీల‌క రాజ‌కీయ నాయ‌కుడు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి. కాంగ్రెస్‌లోను, త‌ర్వాత వైసీపీలోను త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు నుంచి ఎంపీగా వైసీపీలోను, గ‌తంలో కాంగ్రెస్‌లోను ఆయ‌న విజ‌యం సాధించారు. జిల్లాపై ప‌ట్టు సాధించారు. రాష్ట్ర వ్యాప్త స‌మ‌స్య‌ల‌పైనా ఆయ‌న గ‌ళం వినిపించారు. వివాద ర‌హితుడిగా.. మ‌చ్చ‌లేని నాయ‌కుడిగా పేరు తెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. ఆయా పార్టీల్లోనూ కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. రాష్ట్ర విభ‌బ‌జ‌న స‌మ‌యంలో స‌మైక్య రాష్ట్రం కోసం మంచి గ‌ళం వినిపించారు. కాంగ్రెస్‌లో కీల‌క నేత‌ల స‌ర‌స‌న చేరారు. ఆయ‌న నెల్లూరు జిల్లాకు చెందిన నేత అయినా ఒంగోలు నుంచి గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట నుంచి కూడా ఎంపీగా గెలిచారు.

2009లో నెల్లూరు జ‌న‌ర‌ల్ సీటు కాగా 2009లో కాంగ్రెస్‌, 2012 ఉప ఎన్నికల్లో  వైసీపీ, 2014లో వైసీపీ నుంచి ఆయ‌న విజ‌యం సాధించారు. ఢిల్లీలోనూ మంచి లాబీయింగ్ చేయ‌గ‌లిగిన నాయ‌కుడిగా మేక‌పాటి గుర్తింపు సాధించారు. ఇక‌, జ‌గ‌న్ ద‌గ్గ‌ర కూడా ఆయ‌న‌కు మంచి ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా ఎదిగారు. కొన్ని విష‌యాల్లో.. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను ప‌రోక్షంగా ఎదిరించి మాట్లాడ‌డంలోనూ ఆయ‌న ఎన్న‌డూ వెర‌వ‌లేదు. అలాగ‌ని జ‌గ‌న్‌తో ప్ర‌త్యక్ష వివాదాల‌కు కూడా దిగ‌లేదు. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌తో సంబంధాలు కొన‌సాగిస్తూనే.. పార్టీలో తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించారు. ప్ర‌త్యేక హోదాకోసం ఎంపీలు అంద‌రూ రాజీనామా చేయాల‌న్న జ‌గ‌న్ వాద‌న‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

2014లో మేక‌పాటి ఎంపీగా గెలిచినా చివ‌రి రెండేళ్ల‌లో విజ‌య‌సాయి రెడ్డి ప్రాధాన్యం పెర‌గ‌డంతో పాటు మేక‌పాటి ప్రాధాన్యం క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింది. మ‌రి ఈ కార‌ణ‌మో.. లేదా.. అనారోగ్య స‌మ‌స్య‌లో ఏవైనా కానీ.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రాజ‌మోహ‌న్‌రెడ్డి త‌ప్పు కొన్నారు. ఇక‌, ఆయ‌న కుమారుడు గౌతం రెడ్డికి అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్రాధాన్యం మ‌రింత‌గా పార్టీలో అయితే పెరిగింది. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్నారు. కానీ, నెల్లూరు జిల్లా ప్ర‌జ‌ల్లోను, రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా ఆయ‌న ముద్ర వేయ‌లేక‌పోతున్నార‌నేది వాద‌న‌. ఏదైనా ఉంటే.. త‌న వ‌ర‌కు చూసుకుని ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డం మిన‌హా.. ఇత‌ర విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం లేదు.

నిజానికి గ‌తంలో రాజ‌మోహ‌న్‌రెడ్డి ఇలా కాదు.. పార్టీలో ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. త‌న భుజాల‌పై వేసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. వాటినిప‌రిష్క‌రించారు కూడా. జిల్లా స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయాలు చేయ‌డంలో త‌న‌దైన ముద్ర వేసుకున్నార‌ను. కానీ, గౌతంరెడ్డి మాత్రం ఇలాంటి వాటి జోలికి పోవ ‌డం కానీ.. ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని వివాదాస్ప‌ద నిర్ణ‌యాల విష‌యంలో వేలు పెట్ట‌డం కానీ చేయ‌డం లేదు. ఇది ఒక విధంగా మంచిదే అయిన‌ప్ప‌టికీ.. కానీ.. దూర దృష్టితో చూసుకుంటే.. అంద‌రినీ క‌లుపుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అలా అయితేనే స‌మ‌ర్ధ‌వంత‌మైన నేత‌గా రాణింపు ఉంటుంద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే ఆత్మ‌కూరు నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఉన్న‌త విద్యావంతుడు.. పారిశ్రామిక‌వేత్త, యువ‌కుడు అయినా జిల్లాలో మ‌రో మంత్రిగా ఉన్న అనిల్‌కుమార్ యాద‌వ్‌లా దూకుడుగా ముందుకు చొచ్చుకుపోలేక పోతున్నారు. అలాగే ఆయ‌న వాయిస్ కూడా ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. మ‌రి గౌతం రెడ్డి త‌న వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతారో.. రాష్ట్ర నేత‌గా ఎదుగుతారో చూడాలి.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version