Delhi : దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపు

-

దేశ రాజధాని నగరం దిల్లీలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. దిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపులు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏమవుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..?

బుధవారం రోజున దిల్లీలోని మథురా రోడ్‌లోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు ఈ- మెయిల్ వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ అందులో పేర్కొనడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది. తక్షణమే సిబ్బంది, విద్యార్థులను అక్కడి నుంచి బయటకు పంపించింది. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలను గుర్తించలేదు. ప్రస్తుతం ఈ-మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

సరిగ్గా రెండు వారాల క్రితం కూడా ఇదే తరహాలో దిల్లీ పాఠశాలకు ఈ-మెయిల్ వచ్చింది. సాదిఖ్ నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో బాంబులు ఉన్నాయని అందులో పేర్కొనడంతో ఆందోళనకు గురైన యాజమాన్యం.. విద్యార్థులు, టీచర్లను బయటకు పంపించింది. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version