కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఉత్తర్ ప్రదేశ్ లోని న్యాయస్థానం రూ.200 జరిమానా విధించింది. పదే పదే విచారణకు గైర్హాజరు అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14న తదుపరి విచారణకు హాజరుకాకుంటే మాత్రం తీవ్ర చర్యలుంటాయని రాహుల్ గాంధీని హెచ్చరించింది. మహారాష్ట్రలో 2022లో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని.. వారి నుంచి పెన్సన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు స్వాతంత్య్ర సమరయోధుడైన వీర్ సావర్కర్ ను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ కు సంబంధించి తాజాగా మరోసారి విచారణ జరిగింది. రాహుల్ గాంధీ తరపు న్యాయవాది ప్రన్షు అగర్వాల్ హాజరై ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారని.. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.