మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే త్వరలోనే కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఒక పెద్ద ఉపశమనం కలిగించేలా సరికొత్త నిర్ణయం తీసుకోబోతోంది. సాధారణంగా లైసెన్స్ తీసుకున్నాక, ఒక నిర్దిష్ట కాలం తర్వాత మళ్లీ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి రెన్యూవల్ చేయించుకోవడం అందరికీ కాస్త ఇబ్బందికరమైన విషయమే. అందుకే, ఈ తలనొప్పులు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ రూల్స్లో కొన్ని కీలక మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ఆ ముచ్చట్లేంటో ఇప్పుడు చూద్దాం.
20 ఏళ్ల రూల్ మారబోతుందా? : ప్రస్తుతం మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే దానికి 20 ఏళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే, తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ 20 ఏళ్ల పరిమితిని పూర్తిగా మార్చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇక ఈ కొత్త రూల్ గనుక అమల్లోకి వస్తే, లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఏకంగా 50 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎలాంటి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే, ఒక్కసారి లైసెన్స్ తీసుకుంటే ఇక చాలా కాలం పాటు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదన్నమాట.

త్వరలోనే కేంద్రం అఫీషియల్ నిర్ణయం: వాహనదారులకు లైసెన్స్ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర రవాణా శాఖ ఈ ప్రతిపాదనను సీరియస్గా పరిశీలిస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ రూల్ వస్తే ముఖ్యంగా యువతకు, ఉద్యోగస్తులకు ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే సమయం చాలా వరకు ఆదా అవుతుంది.
మిగతా పనులన్నీ ఆన్లైట్ లోనే: కేవలం డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ మాత్రమే కాదు, వాహనదారుల కోసం కేంద్రం మరో సూపర్ ప్లాన్ కూడా వేస్తోంది. సెకండ్ హ్యాండ్ బండ్లు కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు జరిగే ‘వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్స్’ (యజమాని పేరు మార్పిడి), అలాగే రవాణా వాహనాల ‘పర్మిట్ రెన్యూవల్స్’ వంటి పనులను కూడా పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనివల్ల మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట పడనుంది.
ఇక టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఆర్టీఓ సేవలను కూడా డిజిటల్గా మార్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు నిజంగా అభినందించదగ్గవి. 50 ఏళ్ల వయసు వరకు లైసెన్స్ గడువును పెంచే ఈ కొత్త రూల్ గనుక అమల్లోకి వస్తే, కోట్ల మంది వాహనదారులకు పెద్ద ఊరట లభించినట్లే అవుతుంది. ఇక కేంద్రం దీనిపై ఎప్పుడు పచ్చజెండా ఊపుతుందో అని రవాణా రంగ నిపుణులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల ఆధారంగా ఇవ్వబడింది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా తుది నిర్ణయం తీసుకుని, నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే ఈ కొత్త రూల్స్ పూర్తిగా అమలులోకి వస్తాయి.
