గర్భంలో ఉన్న శిశువుకు తల్లి పేగు (బొడ్డు తాడు) రక్షణ కవచంలా ఉంటుంది. కానీ, ఇటీవలి పరిశోధనలు ఆ కవచాన్ని కూడా ప్లాస్టిక్ కణాలు ఛేదిస్తున్నాయని తేల్చాయి. మనం వాడే ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్ల ద్వారా వెళ్లే ‘మైక్రోప్లాస్టిక్స్’ నేరుగా పిండం వద్దకు చేరుతున్నాయి. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, రాబోయే తరాల ఆరోగ్యంపై పడుతున్న నీడ. ఈ ఆందోళనకర మార్పుపై సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రయత్నం ..
నిశ్శబ్ద ముప్పు: బొడ్డు తాడులో ప్లాస్టిక్:సాధారణంగా తల్లి తీసుకునే ఆహారం, ఆక్సిజన్ బొడ్డు తాడు ద్వారా శిశువుకు అందుతాయి. అయితే, శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో బొడ్డు తాడు (Placenta) లో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఇది ఊహించని పరిణామం. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతున్న ఈ కణాలు నేరుగా గర్భాశయం వరకు ప్రయాణిస్తున్నాయి.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?: ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ క్లినికల్ స్టడీస్లో, పరీక్షించిన మెజారిటీ ప్లాసెంటా నమూనాలలో ‘పాలిథిలిన్’ వంటి ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. శిశువు ఎదుగుతున్న సమయంలోనే ఇలాంటి రసాయనాలతో కూడిన కణాలు చేరడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య ప్రభావాలు ఎలా ఉంటాయి?: గర్భంలో ప్లాస్టిక్ ప్రభావం వల్ల శిశువు తక్కువ బరువుతో పుట్టడం, రోగనిరోధక శక్తి తగ్గడం లేదా ఎదుగుదల లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్లోని విషతుల్యాలు రక్తప్రవాహంలో కలవడం వల్ల దీర్ఘకాలంలో శ్వాసకోస మరియు జీవక్రియ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు.
మనం చేయగలిగిన మార్పులేమిటి?: ఈ ముప్పు నుంచి బయటపడాలంటే గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం తగ్గించి, స్టీల్ లేదా గాజు పాత్రలను వాడాలి. తరువాత ఎక్కువ మంది చేసే పొరపాటు వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో లేదా బాక్సుల్లో వేస్తారు..ఇది ప్రమాదం దీనివల్ల ప్లాస్టిక్ కణాలు ఆహారంలో త్వరగా కలుస్తాయి. న్యాచురల్ ఫైబర్ ఉన్న దుస్తులను ధరించడం మంచిది.
ప్రకృతికి మనం చేస్తున్న హాని తిరిగి మన వంశాంకురాలనే తాకుతోంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అనేది కేవలం ఫ్యాషన్ కాదు, అది మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత. నేడే మేల్కొందాం, ప్లాస్టిక్ రహిత గర్భధారణకు బాటలు వేద్దాం.
