యాప్‌లు డెవలప్‌ చేయండి.. క్యాష్‌ ప్రైజ్‌లు పొందండి.. మోదీ కొత్త చాలెంజ్‌..!

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర భారత్‌ యాప్‌ ఇన్నొవేషన్‌ చాలెంజ్‌ను శనివారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక టెక్కీలు, స్టార్టప్‌లు మేడిన్‌ ఇండియా యాప్‌లను డెవలప్‌ చేసేందుకు ఈ చాలెంజ్‌ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్‌ యాప్‌ ఎకో సిస్టమ్‌ను మనం సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతా ఆత్మనిర్భర భారత్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతుందన్నారు.

భారతదేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా యాప్‌లను డెవలప్‌ చేసేందుకు సమయం ఆసన్నమైందని, ఔత్సాహికులకు ఇదే సరైన సమయం అని మోదీ అన్నారు. మనం డెవలప్‌ చేసే యాప్‌లు ప్రపంచ స్థాయి యాప్‌లకు దీటుగా ఉండాలన్నారు.

కాగా ఆత్మ నిర్భర భారత్‌ యాప్‌ ఇన్నొవేషన్‌ చాలెంజ్‌ను మెయిటీ (MeitY), అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌, నీతి ఆయోగ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇక ఇందులో భాగంగా డెవలప్‌ చేసే యాప్‌లకు నగదు బహుమతులు, ప్రోత్సాహకాలను కూడా అందివ్వనున్నారు.

ఆయా విభాగాల్లో డెవలప్‌ చేసే అత్యుత్తమ యాప్‌లకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల భారీ నగదు బహుమతులను ఔత్సాహికులు పొందవచ్చు. యాప్‌లు సులభంగా వాడుకునే విధంగా, పూర్తిగా సురక్షితమైన ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ చాలెంజ్‌ వల్ల దేశంలో ఉన్న ఔత్సాహిక యాప్‌ డెవలపర్లు, స్టార్టప్‌ల నుంచి ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. దీని వల్ల సమాజంలో నెలకొన్న సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారాలు లభిస్తాయన్నారు.

మొత్తం 8 విభాగాల్లో ఔత్సాహికులు యాప్‌లను డెవలప్‌ చేయవచ్చు. ఆఫీస్‌ ప్రొడక్టివిటీ, వర్క్‌ ఫ్రం హోం, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఇ-లెర్నింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, బిజినెస్‌, అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, న్యూస్‌, గేమ్స్‌ విభాగాలకు చెందిన యాప్‌లను డెవలపర్లు అభివృద్ధి చేయవచ్చు. ఇక ఈ చాలెంజ్‌కు చెందిన పూర్తి వివరాల కోసం innovate.mygov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాలనుకునే వారు తమ అప్లికేషన్లను జూలై 18, 2020లోపు సమర్పించాలి. వారు ఈ చాలెంజ్‌లో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version