షర్మిలకు గద్దర్ మద్ధతు..సడన్‌గా హైప్.!

-

తెలంగాణ రాజకీయాల్లో గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన పాటలతోనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిన గద్దర్..ఇపుడు రాజకీయంగా వేస్తున్న అడుగులు అర్ధం కాకుండా ఉన్నాయి. కాసేపు కే‌సి‌ఆర్ ని పొగుతున్నారు..అటు కాంగ్రెస్ లో కనబడతారు..బి‌జే‌పి సభల్లో మెరుస్తారు. ఇప్పుడు షర్మిలకు మద్ధతు తెలిపారు. తాజాగా  టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్న నిరాహార దీక్షలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ క్రమంలో గద్దర్ కూడా దీక్షలో పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే నినాదంతో షర్మిల తన పోరాటం మొదలు పెట్టారని తెలిపారు. మొన్నటి వరకు మంత్రులు ఎక్కడున్నారో ఎవరికి తెలియలేదని.. 30 నుంచి అందరూ మన ముందే ఉంటారన్నారు. ఇక షర్మిల రాజకీయ శక్తిగా మారింది కాబట్టే ఆమెని ఇంటి నుంచి బయటకి రానివ్వడం లేదని, తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప ఏం రాలేదని, కేసీఆర్ కూలిపోయేలా ప్రణాళికతో ముందుకు వెళ్లి ఆయన్ని కూలగొట్టాలని పిలుపునిచ్చారు. షర్మిల తెలంగాణ నాడి పట్టుకున్నారని తెలిపారు.

అయితే తాను ఏ పార్టీ సభ్యుడిని కాదని స్పష్టం చేశారు. షర్మిల ఆత్మ రక్షణ కోసం డిఫెన్స్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. “ గ్రామాలకు తరలండి… ఓట్ల యుద్దానికి సిద్దం కండి. ప్రతి ఇంటిని బూత్ కమిటీగా మార్చండి.” అంటూ ప్రజలకు గద్దర్ పిలుపించారు.  డబ్బుతోనే అధికారం లోకి రావచ్చని కేసీఆర్ ఫిక్స్ అయ్యాడని, కేసీఆర్ అధికారంలోకి వచ్చే సమయంలో ఆయన దగ్గర ఉద్యమాలు ఉన్నాయని,  డబ్బులు లేవని,  ఇప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయని, మన దగ్గర ఉద్యమాలు ఉన్నాయని, మనం పిల్లులతో కొట్లాడుతున్న ఎలుకలం అని చెప్పుకొచ్చారు. మొత్తానికి షర్మిలకు గద్దర్ బాగానే హైప్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version