తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా రేసులోకి వచ్చింది. మొన్నటివరకు రేసులో ఉన్న బిజేపిని వెనక్కినెట్టి కాంగ్రెస్ ముందుకొచ్చింది. బిఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ ముందుకెళుతుంది. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీకి అన్నీ అంశాలు కలిసొస్తున్నాయి. ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. అంతర్గత విభేదాలు తగ్గాయి.
ఇక వరుసపెట్టి బడా నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్టీపీ పెట్టి తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిల సైతం కాంగ్రెస్ వైపు వస్తుందనే ప్రచారం వస్తుంది. ఇటీవల ఆమె..కర్నాటక పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ తో పలుమార్లు భేటీ అయ్యారు. త్వరలోనే డికే..తెలంగాణకు ఇంచార్జ్ గా వస్తారని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే షర్మిల..కాంగ్రెస్కు దగ్గరవుతారని ప్రచారం ఉంది. అయితే కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం చేయడం…లేదా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే పాలేరులో షర్మిల పోటీ చేయాలని అనుకుంటున్నారు. అక్కడ కాంగ్రెస్ మద్ధతు లేకుండా ఆమె గెలవడం కష్టం. అందుకే కాంగ్రెస్కు దగ్గరవుతున్నారని తెలిసింది. కానీ షర్మిలతో కాంగ్రెస్కుఎలాంటి యూజ్ లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆంధ్రాకు చెందిన షర్మిలని కాంగ్రెస్ వైపు తీసుకుంటే మళ్ళీ ఆంధ్రా వాళ్ళు వచ్చారని కేసిఆర్ ప్రచారం చేసి లబ్ది పొందే అవకాశం ఉందని, అయినా షర్మిలాకు ఓటు బ్యాంకు లేదని, ఆమె వల్ల కాంగ్రెస్ కు ఎలాంటి యూజ్ లేదని అంటున్నారు.
ఒకవేళ ఆమె ఏపీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ లో పనిచేస్తే తాను స్వాగతిస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ చెప్పే మాటల్లో కూడా వాస్తవం ఉందని తెలుస్తుంది. షర్మిలకు ఓటు బ్యాంకు లేదు., ఆమె వల్ల నష్టమే తప్ప లాభం లేదు. కాకపోతే కాంగ్రెస్ వల్ల షర్మిలకు పాలేరులో లాభం. మరి రానున్న రోజుల్లో షర్మిల, కాంగ్రెస్ తో కలుస్తారో లేదో చూడాలి.