నేడు దివంగత సీఎం వైఎస్సార్ జయంతి…. తెలుగు ప్రజలకు ఆయన చేరువ అయ్యింది ఎలాగో తెలుసా..?

-

2004కి ముందు సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌ను వరుసగా రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్‌ఆర్‌.. తన మార్క్ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, 108 వంటి సేవల పేరు చెబితే ముందుగా గుర్తుకువచ్చేది ఆయన పేరే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన.దురదృష్టవశాత్తు తిరిగిరాని లోకాలకు వెళ్లిన వైఎస్సార్ అంటే తెలుగు ప్రజలకు ఎనలేని గౌరవం,ఇష్టం,అభిమానం.ఆయన 75వ జయంతి సందర్భంగా ఓసారి స్మరించుకుందాం.

వైఎస్సార్ పూర్తిపేరు యడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి..1949, జులై 8న జన్మించారు.వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. అద్భుతమైన పరిపాలన కారణంగా మహానేతగా పేరు తెచ్చుకుని కేంద్రంలోనూ చక్రం తిప్పారు. ఆరోగ్యశ్రీ,ఫీజు రియంబర్స్మెంట్ వంటి అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. రాజశేఖర రెడ్డి 1978లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి పులివెందుల నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. 1980లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 1982-83లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1983, 1985లో పులివెందుల నుంచి మళ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఇందిరాగాంధీ ఆయన్ను ఏపీకాంగ్రెస్పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. వైఎస్ఆర్ కడప నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వచ్చిన ఆయన 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలుపొందారు. 1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.

ఆర్థిక సంక్షోభం,కరువు,రైతుల ఆత్మహత్యలు వంటివి ఆంధ్రప్రదేశ్ ని కబలించిన వేళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేపట్టిన పాదయాత్ర చరిత్ర గతిని మార్చేసింది. 2003లో 11 జిల్లాల్లో 60 రోజుల్లో 1,500 కిలోమీటర్లు మేర మూడు నెలల పాటు పాదయాత్ర చేశారు.2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత విద్యుత్, పేద గ్రామీణ ప్రజలకు ఆరోగ్య బీమా వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఫ్రీ పబ్లిక్ అంబులెన్స్ సర్వీస్, గ్రామీణ మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు, గ్రామీణ పేదలకు ఉచిత ఇళ్ళు, చౌక బియ్యం, నిరుపేద విద్యార్థులకు కళాశాల ఫీజు రీయింబర్స్‌మెంట్, మైనారిటీలకు రిజర్వేషన్లు…ఇలా ఎన్నో రకాల పథకాలను రూపొందించి ప్రజలకు చేరువ అయ్యారు.

తీవ్రవాద నక్సలైట్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు.వివిధ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా 4 మిలియన్ హెక్టార్ల భూమికి సాగునీరు అందించేందుకు జల యజ్ఞం ప్రాజెక్టును సాకారం చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 156 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని మళ్లీ విజయపథంలో నడిపించారు. 1969 తర్వాత కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో గెలిచిన మొదటి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా వైయస్సార్ రికార్డ్‌ క్రియేట్ చేశారు. 2009, మే 20న ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రస్తుతం ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టి ఒకసారి సీఎం అయ్యారు.ఆయన కుమార్తె షర్మిల రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.తండ్రి వారసత్వంతో వారు ఇద్దరు రాజకీయoగా రాణిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version