ఇప్పటికైనా మోదీ మణిపూర్‌లో పర్యటించి ప్రజలకు విశ్వాసం కల్పించాలి : పొన్నాల

-

ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. మణిపూర్ శాంతి నెలకొంటుంది అంటున్న ప్రధాని పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశం ఎందుకు మాట్లాడలేదన్నారు. మణిపూర్ ఘటనపై పార్లమెంట్‌లో చర్చించకపోవడాన్ని పొన్నాల లక్ష్మయ్య తప్పుబట్టారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలు, మణిపూర్ ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మణిపూర్‌లో ప్రశాంతత నెలకొంటే ఇప్పటివరకూ ప్రధాని మోదీ అక్కడ ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మణిపూర్‌లో పర్యటించి ప్రజలకు విశ్వాసం కల్పించాలని పొన్నాల సూచించారు.

ప్రతిసారి ప్రధాని మోదీ కోవిడ్ గురించి మాట్లాడుతున్నారని, ఆ సమయంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని పొన్నాల ఎద్దేవా చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ గురించి చెప్పే ముందు లక్షలాది మంది చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కోట్లాది మంది వలస కూలీలు నానా తిప్పలు పడ్డారని పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. ఎలాంటి వాహనాలు తిరకపోవడంతో వలస వెళ్లిన వారు కాలినడకన సొంత స్థలాలకు చేరుకున్నారని తెలిపారు. ఆ కష్టాలన్నింటినీ అధిగమించినా గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారని నిలదీశారు. దేశంలో 90 శాతం సామాన్య జనాలే జీఎస్టీ కడుతున్నారని చెప్పారు. ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు, 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత ఏమైందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన అన్నీ హామీలను నెరవేర్చే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర బీజేపీదేనని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version