BREAKING : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

-

ఏపీలోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్‌లో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే అయిదుగురు మృతి చెందారు. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తుండగా మేదరమెట్ల దక్షిణ బైపాస్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్‌ 07 జీడీ 3249 నంబరు గల కారు ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తుంది. మేదరమెట్ల దక్షిణ బైపాస్‌ సమీపంలోకి రాగానే కారు టైరు పంక్చరై అదుపుతప్పి డివైడర్‌ దాటి అవతలి వైపునకు ఎగిరి వెళ్లి పడిపోయింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది.

ప్రమాదంలో కారులో ఉన్న అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న అద్దంకి సీఐ రోశయ్య ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుల్లో నలుగురు మహిళలు కాగా.. ఒక పురుషుడు ఉన్నారు. మృతులు అద్దంకి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ సమందరవలి కుటుంబ సభ్యులుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version