సాగర్ బైపోల్: ఆపరేషన్ ఆకర్ష్ ని ముమ్మరం చేసిన టీఆర్ఎస్,బీజేపీ

-

నాగార్జున సాగర్ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాగర్ బైపోల్ లో సత్తా చాటేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశాయి. సర్వేలు, రీసర్వేలు చేయిస్తూనే …బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే బీజేపీ లో చేరేందుకు కొందరు నేతలు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సాగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్,టీఆరెస్ లోని అసంతృపులకు బీజేపీ గాలం వేస్తోంది.

నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా లో సీఎం కేసీఆర్ సభ తరువాత పార్టీల ఉపఎన్నిక ప్రచారం ఉపందుకుంది. తమ బలాబలాలను బేరీజు వేసుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ని ముమ్మరం చేశాయి. ద్వీతీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. గ్రామస్థాయిలో పట్టున్న నేతలకు గాలం వేస్తున్నాయి పార్టీలు.

దుబ్బాక, జిహెచ్ఎంసీ ఫలితాలతో దూకుడు మీద ఉన్న బీజేపీ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ముందే నియోజక వర్గ ఇంచార్జ్ లను నియమించిన బీజేపీ అధిష్టానం ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసింది. ఇప్పటికె కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ముఖ్య అనుచరులు బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనా రెడ్డి ,రవి కుమార్ నాయక్ బీజేపీ లో చేరారు. రిక్కల ఇంద్రసేనా రెడ్డి, రవికుమార్ నాయక్ బీజేపీ లో చేరడంతో సాగర్ నియోజిక వర్గంలో కాంగ్రెస్ కి షాక్ తగిలినట్లైంది.

మరోవైపు సాగర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ది ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు అధిష్టానం. బీజేపీ టికెట్ కోసం జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదిత రెడ్డి, కడారి అంజయ్య,రిక్కల ఇంద్రాసేనారెడ్డి , రవికుమార్ నాయక్ పోటీ పడుతున్నారు.అటు సాగర్ లో మాజీ మంత్రి జానారెడ్డి కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసారు. టీఆరెస్,బీజేపీల్లోని ద్వీతీయ శ్రేణి నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు.

ఇక సాగర్ ఉప న్నికలో టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ ఉంది. నోముల కుటుంబానికి వ్యతిరేకంగా ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీకి సై అంటున్నారు. టీఆరెస్ నుంచి టికెట్ రాకపోతే వారు బీజేపీ లో చేరేందుకు సిద్ధం గా వున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ టికెట్ ఇవ్వక పోతే తేరా చిన్నపరెడ్డి బీజేపీ లో చేరతారని టాక్. ఇక కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీచేస్తారని ప్రకటన వచ్చిన తరువాత రోజే రిక్కల ఇంద్ర సేనా రెడ్డి పార్టీ మారటం కలకలం రేపింది. ఇదే రకంగా ముందుగా టీఆర్ఎస్ అభ్యర్దిని ప్రకటిస్తే గులాబీ పార్టీలోని అసంతృప్తులకు బీజేపీ, కాంగ్రెస్ గాలం వేస్తుందని భావించిన టీఆర్ఎస్…అబ్యర్ది ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

మొత్తంమీద అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసి.. బలాబలాలను పెంచుకునే ఎత్తులు వేస్తున్నారు. చూడాలి ఎంతవరకూ ఫలిస్తాయో వీరి ప్రయత్నాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version