ఎమ్మెల్యే ఎర కేసు : మరోసారి ప్రతాప్‌ను విచారించిన సిట్‌

-

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దూకుడు పెంచింది. నిన్న న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖను ప్రశ్నించిన సిట్ అధికారులు.. మరోసారి ప్రతాప్‌ను ఇవాళ 8గంటలపాటు విచారించారు. ఆర్ధిక లావాదేవీల వివరాలపై ప్రశ్నించిన అధికారులు.. రాంచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ఖాతాలనుంచి నగదు బదిలీపై సిట్ ఆరాతీసింది. గతంలో నందకుమార్ అంబర్‌పేటలో హోటల్ నిర్వహించగా.. అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అతనికి భారీగా డబ్బు ఇచ్చినట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు.

నిందితులు కేంద్రప్రభుత్వ అధీనంలో కీలకపదవి ఇప్పిస్తామని నమ్మించడంతో భారీగా డబ్బు ఇచ్చానని ప్రతాప్ గౌడ్ అంగీకరించినట్లు తెలిసింది. ఆ విషయంలో నిందితులకు, ప్రతాప్ గౌడ్‌కు మధ్య జరిగిన పలు సంభాషణలు లభ్యమైనట్లు సమాచారం. ప్రతాప్‌గౌడ్ ఫోన్​లలో అవి రికార్డు కావడంతో ఆధారాల నిమిత్తం సిట్ స్వాధీనం చేసుకుంది. రాంచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌తో ప్రతాప్‌ పలు ప్రయాణాలు చేసినట్టు గుర్తించిన అధికారులు ..అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. నందకుమార్ భార్య చిత్రలేఖను సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version