కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ.. గవర్నర్ పై హరీశ్ రావు ఫైర్

-

కాంగ్రెస్, బీజేపీల రహస్యమైత్రి మరోసారి బయటపడిందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని అన్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు.

రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి నిరాకరించిన గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే ఆమోదించారని హరీశ్ రావు మండిపడ్డారు. ఇది ద్వంద్వ నీతి కాదా? అని ప్రశ్నించారు. గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్యా సామాజిక, సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తే అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నాయని అన్నారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version