ఈ రోజుల్లో కిచెన్లోకి వెళ్తే మిక్సీ స్విచ్ వేయగానే క్షణాల్లో చట్నీలు, మసాలాలు రెడీ అయిపోతున్నాయి. కానీ, అప్పట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు రోట్లో నూరిన పచ్చళ్ల రుచే వేరు. ఆ రుచి, ఆరోగ్యం మిక్సీల్లో రావడం లేదని గ్రహించిన జనాలు.. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతుల వైపు మళ్లుతున్నారు. ఇత్తడి, మట్టి పాత్రల తర్వాత ఇప్పుడు వంటింట్లోకి రోలు-రోకలి మళ్లీ గ్రాండ్గా ఎంట్రీ ఇస్తున్నాయి.
అసలు ‘సీజనింగ్’ అంటే ఏమిటి?: కొత్తగా మార్కెట్ నుండి రాతి రోలు లేదా రుబ్బురాయి తెచ్చినప్పుడు దాన్ని నేరుగా వాడకూడదు. ఎందుకంటే వాటిని చెక్కేటప్పుడు సన్నటి రాతి పొడి, ఇసుక రేణువులు అందులోనే ఉండిపోతాయి. నేరుగా వాడితే ఆ రాతి పొడి మనం వండుకునే ఆహారంలో కలిసిపోతుంది. అందుకే రోలును వాడకానికి సిద్ధం చేస్తూ లోపల ఉండే వ్యర్థాలను క్లీన్ చేయడాన్నే ‘సీజనింగ్’ అంటారు.

రోలును సీజనింగ్ చేయడం ఎలా?: కొత్త రోలును సీజనింగ్ చేయడం చాలా సులభం. మొదట రోలును నీళ్లతో బాగా కడగాలి. ఆ తర్వాత అందులో గుప్పెడు ముడి బియ్యం లేదా దొడ్డు ఉప్పు (కల్లుప్పు) వేసి రోకలితో బాగా దంచాలి. ఇక ఆ బియ్యం పిండి నల్లగా మారే వరకు దంచి, దాన్ని పారేయాలి. ఈ పద్ధతిని రెండు మూడు సార్లు చేస్తే రోలు లోపల ఉండే రాతి పొడి అంతా శుభ్రంగా పోయి, ఉపరితలం నునుపుగా మారుతుంది.
నూనె, పసుపుతో ముగింపు టచ్: బియ్యంతో క్లీన్ చేసిన తర్వాత, రోట్లో కాస్త పసుపు, కొద్దిగా వంట నూనె లేదా నీళ్లు పోసి మళ్లీ ఒకసారి బాగా నూరాలి. ఆ ముద్దను కూడా తీసేసి, వేడి నీళ్లతో రోలును క్లీన్ గా కడిగేయాలి. ఇక ఇలా చేయడం వల్ల రాయికి ఉండే పసరు వాసన పోవడమే కాకుండా, రోలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఆ తర్వాత మీరు హ్యాపీగా అందులో పచ్చళ్లు నూరుకోవచ్చు.
కష్టమైనా సరే, రోట్లో నూరిన పచ్చడి తింటే ఆ తృప్తే వేరు. శ్రమ అనుకోకుండా ఇలాంటి సాంప్రదాయ పద్ధతులను పాటించడం వల్ల వంటలకు అద్భుతమైన రుచి రావడంతో పాటు, దంచడం వల్ల చేతులకు మంచి వ్యాయామం లభించి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అందుకే ఈ రోజే మీ ఇంట్లోని కొత్త రోలును సీజనింగ్ చేసి, పాతకాలపు రుచులను ఆస్వాదించండి.
గమనిక: రాతి రోళ్లకు మాత్రమే కాకుండా మట్టి పాత్రలు, ఇనుప కడాయిలకు కూడా వాడకానికి ముందు సీజనింగ్ చేయడం ఎంతో అవసరం. ఇది పాత్రల మన్నికను పెంచుతుంది.
