ఒకప్పుడు నదులు పారిన చోట నేడు ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బావుల్లో దోపిడితో దొరికిన నీరు, నేడు వెయ్యి అడుగుల లోతుకు పడిపోయింది. నీరు లేనిదే జీవం లేదు, కానీ అదే నీరు ఇప్పుడు వ్యాపార వస్తువుగా మారిపోయింది. మనం నేడు వృథా చేస్తున్న ప్రతి నీటి చుక్క, రేపటి మన బిడ్డల గొంతు ఎండబెట్టడమే. భవిష్యత్తు తరాలకు మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేనంత భారంగా ఈ సమస్య మారుతోంది.
భూమి మీద మూడు వంతులు నీరు ఉన్నప్పటికీ, తాగడానికి ఉపయోగపడేది కేవలం ఒక శాతం మాత్రమే. కానీ ఆ ఒక్క శాతాన్ని కూడా మనం విషతుల్యం చేస్తున్నాం. మనం ఎదుర్కోబోతున్న నీటి సంక్షోభం మన ఊహకు అందనంత భయంకరంగా ఉండబోతోంది.
భూగర్భ జలాల పతనం: మన పూర్వీకులు బావులు తవ్వితే నీళ్లు పడేవి. మన తరం బోరు బావులతో భూమి పొట్ట చీల్చి ఉన్న నీటిని తోడేస్తోంది. ఫలితంగా ‘వాటర్ టేబుల్’ అథఃపాతాళానికి పడిపోయింది. రాబోయే పదేళ్లలో అనేక మెట్రో నగరాలు ‘డే జీరో’ (నీరు పూర్తిగా అయిపోయే రోజు) దిశగా వెళ్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కాలుష్యం – అందని స్వచ్ఛత: ఒకవైపు నీరు తగ్గిపోతుంటే, ఉన్న నీటిని పరిశ్రమల వ్యర్థాలతో ప్లాస్టిక్తో కలుషితం చేస్తున్నాం. నదులన్నీ మురుగు కాలువల్లా మారుతున్నాయి. భవిష్యత్తులో యుద్ధాలు సరిహద్దుల కోసం కాకుండా నీటి చుక్క కోసం జరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది అతిశయోక్తి కాదు రేపటి చేదు నిజం.
మనం ఏం చేయాలి?: భవిష్యత్తు తరాలకు ఈ భారం తగ్గించాలంటే ఇప్పుడే మేల్కోవాలి. వర్షపు నీటి నిల్వ చేయాలి. ప్రతి ఇల్లు ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. ఆకాశం నుంచి కురిసే అమృతాన్ని భూమిలోకి పంపాలి.
వృథా అరికట్టడం: బ్రష్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కుళాయిలను అనవసరంగా వదిలేయడం మానుకోవాలి. వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు, ఇతర అవసరాలకు వాడటం అలవాటు చేసుకోవాలి.
మన పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి.. వారు దాహం తీర్చుకోవడానికి అందుబాటులో ఉండే స్వచ్ఛమైన నీరు మాత్రమే. నీటిని పొదుపు చేద్దాం.. ప్రాణకోటిని కాపాడదాం!
