కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎమ్మెల్సీ కవిత మరోసారి ఫైర్ అయ్యారు. ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. జనగణన ఇంకెప్పుడు ప్రారంభిస్తారని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగణనను కావాలనే కేంద్రం విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు.జనాభా లెక్కలు చేయకపోవడంతో వృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. సెన్సస్ చేయకపోతే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని అడిగారు.ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా,నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో జనాభా లెక్కల కోసం నామమాత్రంగా రూ.574.80 కోట్లను మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే.