సాధారణంగా గ్యాస్ కొరత అంటే వంట గదిలో ఇబ్బందులు వస్తాయని అనుకుంటాం. కానీ, ఇప్పుడు ఈ సెగ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ నెట్వర్క్లకు కూడా తగిలేలా ఉంది. టెలికాం టవర్ల తయారీలో కీలకమైన గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో, కొత్త టవర్ల ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల భవిష్యత్తులో మన మొబైల్ సిగ్నల్స్, నెట్ స్పీడ్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
టవర్ల తయారీకి గ్యాస్ ఎందుకు?:మొబైల్ టవర్లు ఎండకు ఎండి, వానకు తడిసినా పాడవకుండా ఉండాలంటే వాటికి ‘గాల్వనైజేషన్’ అనే ప్రక్రియ చాలా అవసరం. అంటే ఇనుము తుప్పు పట్టకుండా జింక్ పూత పూస్తారు. ఈ పని జరగాలంటే భారీగా LPG లేదా LNG గ్యాస్ అవసరమవుతుంది. ఇక ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడటంతో ఈ గాల్వనైజేషన్ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా టవర్ల తయారీ మందగించింది.
నెట్వర్క్ విస్తరణకు బ్రేక్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను విస్తరించడానికి వేల సంఖ్యలో కొత్త టవర్లు అవసరం. ఒకవేళ టవర్ల ఉత్పత్తి ఆగిపోతే, కొత్త ప్రాంతాలకు సిగ్నల్స్ చేరడం కష్టమవుతుంది. దీనివల్ల టెలికాం కంపెనీలు అనుకున్న సమయానికి నెట్వర్క్ అప్గ్రేడ్ చేయలేవు.ఇక ఇది నేరుగా వినియోగదారులకు అందే సేవలపై ప్రభావం చూపుతుంది.

ఇంటర్నెట్ స్లో అయ్యే ఛాన్స్: యూజర్లు పెరుగుతున్న కొద్దీ టెలికాం కంపెనీలు అదనపు టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడితే, ఉన్న టవర్లపై భారం పెరిగి కాల్ డ్రాప్స్ రావడం లేదా ఇంటర్నెట్ వేగం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో డిజిటల్ సేవలన్నీ కుంటుపడే ప్రమాదం ఉంది.
తయారీదారుల ఆందోళన: గ్యాస్ ధరలు పెరగడం ఒక ఎత్తయితే, అసలు సరఫరానే సరిగ్గా లేకపోవడం వల్ల పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయని తయారీదారులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమలకు అవసరమైన గ్యాస్ కేటాయింపులు చేయాలని కోరుతున్నారు. లేదంటే మొబైల్ సేవల రంగంలో సంక్షోభం తప్పదని హెచ్చరిస్తున్నారు.
వంట గ్యాస్ కొరత అనేది కేవలం ఇంధన సమస్య మాత్రమే కాదు, అది మన కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా దెబ్బతీసేలా ఉంది. ప్రభుత్వం మరియు కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోతే, సామాన్యులకు సిగ్నల్ కష్టాలు తప్పవు.
