హనుమాన్ జయంతి అనగానే మనకు ఆంజనేయ స్వామి ఆలయాలు, ఆకుపూజలు, సింధూర అలంకరణలు గుర్తొస్తాయి కదా! అయితే హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? దీని వెనుక రాముడిపై హనుమకు ఉన్న అంతులేని భక్తిని చాటిచెప్పే ఒక అద్భుతమైన కథ ఉంది. ఈ హనుమత్ జయంతి పర్వదినాన ఆ ఆసక్తికరమైన పురాణ గాథను తెలుసుకుంటే స్వామివారిపై మనకు భక్తి మరింత పెరుగుతుంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సీతమ్మను చూసి ఆశ్చర్యపోయిన హనుమ: రావణాసురుడి సంహారం తర్వాత శ్రీరాముడు, సీతాదేవి మరియు హనుమంతుడు అందరూ అయోధ్యకు చేరుకుంటారు. ఒకరోజు ఉదయం సీతాదేవి అద్దం ముందు కూర్చుని తన నుదుటిపై ఎర్రటి సింధూరాన్ని దిద్దుకుంటూ ఉంటుంది. అది చూసిన హనుమంతుడికి చాలా కుతూహలం కలిగింది. వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్లి.. “తల్లీ! నువ్వు రోజూ నుదుటిపై ఆ ఎర్రటి పొడిని ఎందుకు పెట్టుకుంటావు?” అని అమాయకంగా అడుగుతాడు.
రాముడి ప్రాణాల కోసం సింధూరం: హనుమంతుడి అడిగిన ప్రశ్నకు సీతాదేవి చిరునవ్వు నవ్వి.. “హనుమా! ఇది సింధూరం. దీన్ని నేను నుదుటన ధరిస్తే నా భర్త అయిన శ్రీరాముడి ఆయుష్షు పెరుగుతుంది. ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా ఉంటారు” అని చెబుతుంది. ఇక సీతమ్మ నోట ఆ మాట విన్న హనుమంతుడు ఒక్క క్షణం తీవ్రంగా ఆలోచనలో పడిపోతాడు. రాముడంటే ప్రాణమిచ్చే ఆ భక్తుడి మనసులో ఒక సరికొత్త ఆలోచన మెదులుతుంది.

ఒళ్లంతా సింధూరం పూసుకున్న హనుమంతుడు: సీతమ్మ కేవలం చిటికెడు సింధూరం పెట్టుకుంటేనే నా రాముడికి అంత ఆయుష్షు పెరిగితే.. నేను ఒళ్లంతా సింధూరం పూసుకుంటే నా స్వామి ఎల్లకాలం అమరుడిగా జీవిస్తాడు కదా అని హనుమ భావిస్తాడు. ఇంకేముంది.. వెంటనే వెళ్లి మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో సింధూరాన్ని తెచ్చుకుని, తన తల నుంచి పాదాల వరకు ఒళ్లంతా ఆ ఎర్రటి సింధూరాన్ని దట్టంగా పూసేసుకుంటాడు. ఆ రూపంలోనే నేరుగా శ్రీరాముడి కొలువులోకి వెళ్తాడు.
హనుమ భక్తిని చూసి మురిసిపోయిన రాముడు: ఒళ్లంతా ఎర్రగా మార్చుకుని సభలోకి వచ్చిన హనుమంతుడిని చూసి అక్కడున్న వారందరూ నవ్వడం మొదలుపెడతారు. కానీ శ్రీరాముడు మాత్రం హనుమను దగ్గరకు పిలిచి ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. అప్పుడు హనుమ.. “స్వామీ! మీ ఆయుష్షు కలకాలం వర్ధిల్లాలని నేను ఒళ్లంతా సింధూరం పూసుకున్నాను” అని చెబుతాడు. ఇక ఆ మాట విన్న రాముడి మనసు కరిగిపోతుంది. హనుమంతుడి నిష్కల్మషమైన భక్తికి మురిసిపోయి ఆయన్ను గట్టిగా హత్తుకుంటాడు.
అందుకే హనుమంతుడికి సింధూరం అంటే ఇష్టం: హనుమంతుడి భక్తికి మెచ్చిన శ్రీరాముడు.. “హనుమా! ఇకపై ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో, వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. వారికి నా అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది” అని వరమిస్తాడు. ఇక అందుకే నాటి నుంచి నేటి వరకు హనుమంతుడికి భక్తులు ఎంతో ఇష్టంగా సింధూరాన్ని సమర్పిస్తుంటారు. ఈ కథ వింటే రాముడి కోసం హనుమ ఎంతటి పిచ్చి భక్తిని చూపాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా!
హనుమంతుడి సింధూర గాథ వింటుంటేనే ఒళ్లు పులకరిస్తుంది కదా! భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు.. భగవంతుడి క్షేమం కోసం తనను తాను పూర్తిగా అర్పించుకోవడమే అసలైన భక్తి అని హనుమ నిరూపించాడు. ఈ హనుమాన్ జయంతి రోజున ఆ స్వామిని సింధూరంతో పూజించి, ఆంజనేయుడితో పాటు శ్రీరాముడి కృపను కూడా పొందుదాం.
