ఒకప్పుడు ఇంటర్నెట్ వాడాలన్నా, ఒక సాదాసీదా మొబైల్ ఫోన్ కొనాలన్నా సామాన్యుడు ఎంతో ఆలోచించాల్సి వచ్చేది. కానీ, గడిచిన పన్నెండేళ్లలో దేశంలో డిజిటల్ రంగం ఊహించని వేగంతో దూసుకుపోయిందని అధికారిక నివేదిక వెల్లడించింది. బుధవారం విడుదల చేసిన ‘మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన’ నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ డేటా ధరలు భారీగా తగ్గడం, ముఖ్యంగా నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపునిచ్చింది. ఈ డిజిటల్ రివల్యూషన్ సాధించిన అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ. 269 నుంచి రూ. 8 కి పడిపోయిన డేటా ధరలు: ఈ డిజిటల్ విప్లవానికి ప్రధాన కారణం ఇంటర్నెట్ డేటా ధరలు భారీగా దిగిరావడమే. 2014వ సంవత్సరంలో ఒక జీబీ (1 GB) డేటా సగటు ధర రూ. 269 గా ఉండేది. కానీ ప్రస్తుతం అది ఏకంగా 97 శాతం తగ్గి రూ. 8 నుంచి రూ. 10 కి పడిపోయింది. ఇక ఈ చౌక డేటా వల్లే దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2014లో కేవలం 25 కోట్లు ఉంటే, 2025 డిసెంబర్ నాటికి అది నాలుగు రెట్లు పెరిగి ఏకంగా 103 కోట్లకు చేరింది.
గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ విస్తరణ..జీడీపీకి బూస్ట్ : గడిచిన 12 ఏళ్లలో దేశంలో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు 17 రెట్లు పెరిగి, ఆరు కోట్ల నుంచి 100 కోట్లకు దూసుకెళ్లాయి. నగరాల కంటే మన గ్రామాల్లోనే ఇంటర్నెట్ వాడకం వేగంగా విస్తరించడం విశేషం. దీనివల్ల ఈ–కామర్స్, ఆన్లైన్ సేవలు పుంజుకుని, ఉపాధి కల్పనతో పాటు దేశ జీడీపీ వృద్ధికి కారణమైంది. ఇక 2022–23లో భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ రూ. 31.64 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జాతీయ ఆదాయంలో 11.74 శాతానికి సమానం. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి జాతీయ ఆదాయంలో డిజిటల్ రంగం వాటా దాదాపు 20 శాతానికి చేరుతుందని అంచనా.

మొబైల్స్ దిగుమతి చేసుకునే స్థాయి: ఒకప్పుడు మొబైల్ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి ఎగుమతిదారుగా అవతరించింది. ఇక 2014లో దేశంలో కేవలం రెండే రెండు మొబైల్ తయారీ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 300 దాటింది. దీనివల్ల మొబైల్ ఎగుమతుల విలువ రూ. 0.016 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 2.6 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే, ఒకప్పుడు ఒక్కటి కూడా లేని సెమీకండక్టర్ (చిప్) ప్లాంట్లకు గాను, ప్రస్తుతం మోదీ ప్రభుత్వం 12 ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేసింది. స్వదేశీ సాంకేతికతతో 5జీ టెలికాం పరికరాల తయారీలోనూ భారత్ ముందడుగు వేసింది.
ప్రభుత్వ గుర్తింపు కార్డుల జారీలో వేగం: డిజిటల్ మౌలిక వసతుల విస్తరణతో పాటు, గడిచిన దశాబ్ద కాలంలో ప్రభుత్వ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ కూడా దేశంలో భారీగా ఊపందుకుంది. ఇక 2014 నాటికి దేశంలో 61.01 కోట్లుగా ఉన్న లబ్ధిదారుల కార్డుల సంఖ్య, ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం ఏకంగా 144 కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఈ డిజిటల్ విప్లవం ద్వారా దేశంలో సమాచారం, వనరులు, సరికొత్త అవకాశాలు ప్రజలందరికీ సులభంగా లభిస్తున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికను చూస్తే, భారతదేశం డిజిటల్ లీడర్గా ఎంత వేగంగా ఎదుగుతుందో అర్థం చేసుకోవచ్చు. చౌకైన ఇంటర్నెట్, దేశీయంగా మొబైల్స్ మరియు చిప్స్ తయారీ వంటివన్నీ రాబోయే రోజుల్లో దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి.
