హిందూ సంప్రదాయంలో నాగ పంచమి, నాగుల చవితి పండుగల వేళ పుట్టలో పాలు పోయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే “పాములు పాలు తాగుతాయి” అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ శాస్త్రీయంగా చూస్తే పాములు అసలు పాలే తాగవు! మరి ఈ నమ్మకం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాస్త్రం ఏం చెబుతోంది?: పాములు శరీసృపాల జాతికి చెందినవి, క్షీరదాలు కావు. వాటి శరీరంలో లాక్టోజ్ను జీర్ణం చేసుకునే ఎంజైమ్లు అసలు ఉండవు. ఇక పాములు పూర్తిగా మాంసాహారులు. అవి ఎలుకలు, కప్పలు, చిన్న కీటకాలను మాత్రమే తింటాయి. ఒకవేళ పాము కడుపులోకి పాలు వెళితే తీవ్రమైన అజీర్తి, ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
పాలు తాగడానికి అసలు కారణం: పండుగలకు కొద్దిరోజుల ముందు పాములు పట్టేవారు వాటిని పట్టుకుని చీకటి పెట్టెల్లో బంధిస్తారు. రోజులు తరబడి వాటికి నీళ్లు, ఆహారం ఇవ్వకుండా ఆకలి, తీవ్రమైన దాహంతో అలమటించేలా చేస్తారు. ఇక పండుగ రోజు గిన్నెలో పాలు పెట్టగానే, దాహంతో అల్లాడిపోతున్న పాము అది నీరే అనుకుని ప్రాణాలు నిలుపుకోవడానికి తాగుతుంది.

ప్రచారంలో ఉన్న పుకార్లు: జెర్రిపోతు (ధామిన్ సర్పం) ఆవు పాలు తాగుతుందని పల్లెటూర్లలో ఒక నమ్మకం ఉంది. కానీ అది కేవలం పుకారు మాత్రమే. నిజానికి ఆ పాము గోశాలలకు వచ్చేది పాలు తాగడానికి కాదు, అక్కడ తిరిగే ఎలుకలను వేటాడటానికి మాత్రమే.
సామెత వెనుక అంతరార్థం: “పాముకు పాలు పోసి పెంచినా విషమే కక్కుతుంది” అనే నమ్మకం మన పూర్వీకుల నుంచి వచ్చింది. ఇది పాము శారీరక అలవాటు కంటే కూడా.. చెడ్డవారికి ఎంత మేలు చేసినా వారు తిరిగి హానియే తలపెడతారని చెప్పడానికి వాడే ఒక లోకోక్తి.
మన నమ్మకాలు, ఆచారాల వెనుక ఉన్న నిజాలను గ్రహించి, నోరులేని జీవులను కాపాడుకోవడం మన బాధ్యత. మూఢనమ్మకాల కంటే శాస్త్రీయ అవగాహనే ముఖ్యం!
గమనిక: నాగ పంచమి, నాగుల చవితి సందర్భాల్లో పాములకు బలవంతంగా పాలు తాగించడం వల్ల అవి చనిపోయే ప్రమాదం ఉంది. జీవులను హింసించకుండా పండుగలను జరుపుకోవడం శ్రేయస్కరం.
