ఇష్టమైన వంటకం కడుపారా తిన్నాక పొట్ట ఉబ్బరంగా అనిపించి ఇబ్బంది పెడుతుందా? బయట ఫుడ్ తిన్నా, ఇంట్లో భోజనం చేసినా చాలామందిని వేధించే సమస్య ఇది. సమయానికి తినకపోవడం, సరిగ్గా నమలకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అసలు ఈ బ్లోటింగ్ ఎందుకు వస్తుందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, దానికి దూరంగా ఉండటమూ అంతే అవసరం. మన వంటింట్లోనే దొరికే వాటితో ఈ సమస్యను సులువుగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..
సమస్యకు అసలు కారణం ఏంటి?: మనం త్వరత్వరగా ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగేయడం, వేళపాళ లేకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక దీనివల్ల కడుపులో గ్యాస్ తయారై ఉబ్బరంగా మారుతుంది. ఇది కేవలం అసౌకర్యాన్నే కాకుండా దీర్ఘకాలంలో ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.
జీలకర్ర, వాము నీళ్ల ప్రయోజనం: కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి ఇది అద్భుతమైన చిట్కా. ఇక ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ వాము కలిపి తాగాలి. వీటిలో ఉండే ప్రత్యేక సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్లను పెంచి, కడుపును తేలికగా మారుస్తాయి.

సోంపు నీటితో జీర్ణక్రియకు మెరుగుదల: సోంపులో ఉండే గుణాలు జీర్ణక్రియను వేగవంతం చేసి, కడుపులో మంటను తగ్గిస్తాయి. కొన్ని సోంపు గింజలను పొడి చేసి, అందులో ఒకట్రెండు స్పూన్ల పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. ఇక ఇది పొట్ట అసౌకర్యాన్ని తగ్గించి, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
నిమ్మరసం, పసుపు కాంబినేషన్: ఒక గ్లాసు వేడి నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి కలిపి తాగాలి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తే, పసుపు ప్రేగుల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇక ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
భోజనం తర్వాత వచ్చే బ్లోటింగ్ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, ఈ చిన్న చిన్న గృహ వైద్యాలను పాటించి ఉపశమనం పొందవచ్చు. రోజూ సరిగ్గా నమిలి తినడం, సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఈ సమస్యల నుంచి సులువుగా దూరంగా ఉండవచ్చు.
గమనిక: ఇవి కేవలం సాధారణ ఉపశమనం కోసం పాటించే చిట్కాలు మాత్రమే. సమస్య తీవ్రంగా ఉన్నా లేదా దీర్ఘకాలంగా వేధిస్తున్నా కచ్చితంగా వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది.
