ఓటీటీలోకి ‘సామజవరగమన’.. చెప్పిన టైమ్‌ కంటే ముందే వచ్చేసిందిగా

-

ఈ నెలలో థియేటర్లలో విడుదలైన సినిమాల్లో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది సామజవరగమన మూవీ. శ్రీవిష్ణు కథానాయకుడిగా, రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో ఇటీవల విడుదలై, ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ సినిమాని తమ ప్లాట్‌ఫామ్‌పై ఈ నెల 28న రిలీజ్‌ చేస్తున్నట్టు ‘ఆహా’ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడా తేదీని మార్చింది. ప్రేక్షకుల డిమాండ్‌ మేరకు చెప్పిన టైం కంటే ముందే.. ఇవాళ రాత్రి 7 గంటలకు సినిమాని స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు.

స్టోరీ ఏంటంటే.. : బాలు (శ్రీవిష్ణు) ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. సంపాదించే ప్ర‌తి రూపాయిని జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు పెట్టే స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి మ‌న‌స్త‌త్వం త‌న‌ది. తండ్రి ఉమా మహేశ్వ‌ర‌రావు (న‌రేశ్‌)ను డిగ్రీ పాస్ చేయించేందుకు తిప్ప‌లు ప‌డుతుంటాడు. ఎందుకంటే ఆయ‌న డిగ్రీ పూర్తి చేస్తేనే త‌న తాత వీలునామా ప్ర‌కారం కోట్ల రూపాయ‌ల ఆస్తి చేతికొస్తుంది. ఆయ‌న డిగ్రీ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాసే క్ర‌మంలో స‌ర‌యు (రెబా మోనికా జాన్‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఆమె పేయింగ్ గెస్ట్‌గా బాలు ఇంట్లోకి అడుగు పెడుతుంది. బాలు, స‌ర‌యుతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రూ పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవ‌డానికి ఓ ప్ర‌ణాళిక కూడా ర‌చిస్తారు. అయితే త‌న‌ బావ పెళ్లి బాలుకు ఓ విచిత్ర‌మైన స‌మ‌స్య తెచ్చిపెడుతుంది. మ‌రి ఆ స‌మ‌స్య ఏంటి? వీళ్ల ప్రేమ క‌థ చివ‌ర‌కు ఏమైంది?  అన్న‌వి తెర‌పై చూసి తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version