సాధారణంగా దుర్గాపూజ ముగియగానే మట్టితో చేసిన అమ్మవారి విగ్రహాలను నదీజలాల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కానీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో దాదాపు 258 సంవత్సరాలుగా నిమజ్జనానికి నోచుకోకుండా భక్తులకు దర్శనమిస్తున్న ఒక అద్భుతం ఉంది. చరిత్ర సంప్రదాయం మేళవించిన ఈ విగ్రహం కేవలం మట్టి ప్రతిమ మాత్రమే కాదు అనేక తరాల భక్తికి విశ్వాసానికి చిహ్నం.ఆ విగ్రహాన్ని ఇప్పటికీ నిమజ్జనం చేయలేదు. ఈ పురాతన ఆలయం విశిష్టత, పురాణ కథ తెలుసుకుందాం..
చరిత్ర : వారణాసిలోని చారిత్రక దుర్గబరి ఆలయంలో నెలకొల్పబడిన ఈ అరుదైన దుర్గాదేవి మట్టి విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ విగ్రహాన్ని మొట్టమొదటగా క్రీ.శ. 1766లో స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు పూర్తయిన తర్వాత భక్తులు ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు. అయితే ప్రతీసారి ఏదో ఒక అవాంతరం జరగడం లేదా విగ్రహం నిమజ్జనం కాకుండా ఆగిపోతున్నట్టు కొన్ని సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతారు.
పురాణాల ప్రకారం ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదని సాక్షాత్తు దుర్గాదేవి ఆదేశించిందని భక్తులు విశ్వసిస్తారు. నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించిన పూజారులకు, కలలో కనిపించి తాను ఎప్పటికీ ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెప్పిందట. అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని శాశ్వత విగ్రహంగా పరిగణించడం మొదలుపెట్టారు.

అద్భుతం: ఈ విగ్రహం మట్టితో చేసినప్పటికీ 258 ఏళ్లుగా నిమజ్జనం చేయకుండా ఉండటం ఒక అద్భుతం గా పరిగణిస్తారు. విగ్రహం శిథిలం కాకుండా ఉండేందుకు ఆలయ అధికారులు, పూజారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం దుర్గాపూజ సమయంలో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి నవరాత్రులు ముగిశాక నిమజ్జనం చేయాల్సిన భాగాలను (కొన్ని చిన్నపాటి ఆభరణాలు లేదా భాగాలను) మాత్రమే నిమజ్జనం చేస్తారు. ప్రధాన విగ్రహం మాత్రం ఆలయంలోనే శాశ్వతంగా ఉంటుంది. ఈ ఆలయం దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్రా స్థలంగా నిలిచింది.
వారణాసిలోని దుర్గబరి ఆలయం కేవలం ఒక పురాతన దేవాలయం మాత్రమే కాదు ఇది నిమజ్జనం కాని దుర్గామాత విగ్రహం ద్వారా అచంచలమైన విశ్వాసాన్ని శతాబ్దాల సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. 1766 నుండి నేటి వరకు తరతరాలుగా భక్తుల పూజలను అందుకుంటూ నిత్యం కరుణను పంచుతున్న ఈ మట్టి ప్రతిమ భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా మిగిలిపోతుంది.