భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో వైశాఖ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఇద్దరు మహానుభావులు.. ఆదిశంకరాచార్యులు మరియు రామానుజాచార్యుల జయంతి వైశాఖ శుద్ధ పంచమిరోజున ఏప్రియల్ 22 న జరుపుకుంటాము. ఒకరు జ్ఞాన మార్గాన్ని బోధిస్తే, మరొకరు భక్తితో కూడిన సమానత్వాన్ని చాటి చెప్పారు. ఈ ఇద్దరు జగద్గురువులు అందించిన సందేశం నేటి కాలానికి కూడా ఎంతో అవసరం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
జ్ఞానజ్యోతిని వెలిగించిన శంకరాచార్యులు: ఆదిశంకరాచార్యుల జయంతి అంటే అది కేవలం ఒక పుట్టిన రోజు మాత్రమే కాదు, భారతీయ తత్వశాస్త్రానికి పునర్జన్మ నిచ్చిన రోజు. ‘అద్వైతం’ అనే సిద్ధాంతం ద్వారా, మనిషిలో ఉన్న ఆత్మ మరియు పరమాత్మ ఒకటే అని ఆయన చాటి చెప్పారు. దేశం నలుమూలలా పర్యటించి, నాలుగు పీఠాలను స్థాపించి, చెల్లాచెదురుగా ఉన్న హిందూ ధర్మాన్ని ఒక్కటి చేశారు. మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలో ఆయన ప్రపంచానికి నేర్పారు.
భక్తి మరియు సమానత్వానికి కేరాఫ్ రామానుజ: శ్రీ రామానుజాచార్యుల జయంతిని భక్తి మార్గానికి దక్కిన గౌరవంగా భావిస్తారు. భగవంతుడి ముందు అందరూ సమానమే అని ఆరోజే చాటి చెప్పిన విప్లవకారుడు ఆయన. కులమతాల భేదం లేకుండా అందరికీ నారాయణ మంత్రాన్ని ఉపదేశించి, భక్తిలో సమానత్వాన్ని తీసుకువచ్చారు. ‘విశిష్టాద్వైతం’ ద్వారా భగవంతుడికి శరణాగతి చెందడమే ముక్తికి మార్గమని ఆయన లోకానికి చాటి చెప్పారు.

నేటి తరానికి వీరి సందేశం: ఈ ఇద్దరు ఆచార్యుల మార్గాలు వేరైనా, వారి లక్ష్యం ఒక్కటే.. అది లోక కళ్యాణం. సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు, మనుషుల మధ్య విద్వేషాలు పెరిగినప్పుడు వీరి బోధనలు మనకు దారి చూపిస్తాయి. క్రమశిక్షణతో కూడిన జీవితం, తోటివారిపై ప్రేమ, భగవంతునిపై విశ్వాసం ఉండాలని వీరు నిరూపించారు. ఇక వారి జయంతి ఉత్సవాలు మనల్ని మనం మంచి మనుషులుగా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం.
ఆధ్యాత్మికతతో కూడిన జీవనశైలి: శంకరాచార్యుల మేధస్సు, రామానుజాచార్యుల కరుణ.. ఈ రెండూ మనకు రెండు కళ్లు లాంటివి. జ్ఞానం మనిషిని వివేకవంతుడిని చేస్తే, భక్తి మనిషిని వినయశీలిని చేస్తుంది. నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో మానసిక ప్రశాంతత కావాలంటే వీరి రచనలు, స్తోత్రాలు చదవడం ఎంతో మేలు చేస్తుంది. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, సమాజ హితం కోసం పాటుపడటమే వీరిద్దరికీ మనం ఇచ్చే అసలైన నివాళి. ఆచార్యుల పట్ల భక్తి గౌరవాలతో ప్రవర్తించడం మన ధర్మం.
ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు కేవలం గురువులు మాత్రమే కాదు, వారు భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు. వారి జయంతి సందర్భంగా వారి బోధనలను స్మరించుకుంటూ, మన జీవితాలను మరింత అర్థవంతంగా మార్చుకుందాం.
గమనిక: జయంతి తేదీలు తిథుల ప్రకారం మారుతుంటాయి. మీ ప్రాంతంలోని పంచాంగం లేదా ఆలయ పండితులను సంప్రదించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి.
